తడ వద్ద తీరం దాటిన వాయుగుండం
. భారీవర్షాలతో కోస్తా, సీమ జిల్లాలు అతలాకుతలం
. అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం
. జలాశయాలకు భారీ వరద
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి /విశాఖపట్నం : వాయుగుండం ప్రభావంతో కోస్తా, సీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తిరుపతి జిల్లా తడ వద్ద వాయుగుండం తీరం దాటింది. 22 కిలోమీటర్ల వేగంతో కదిలి తీరాన్ని తాకినట్లు వాతావరణశాఖ ప్రకటించింది. అనంతరం అల్పపీడనంగా బలహీనపడిరది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల జనజీవనం స్తంభించింది. విశాఖపట్నం, కాకినాడ తీరాల్లో పెద్ద ఎత్తున సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద అలలు దుకాణాలను తాకాయి. కాకినాడ జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీగా రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు నేల కూలాయి. అంతర్వేది తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గోదావరి సంగమం వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. పల్లిపాలెంలో ఇళ్లు, బీచ్ రోడ్డును అలలు ముంచెత్తాయి. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి. ఓఎన్జీసీ ప్లాంటును సముద్రపు నీరు తాకింది. ఆక్వా చెరువులను సముద్రం నీరు ముంచెత్తింది.
జలాశయాలకు భారీ వరద
శ్రీసత్యసాయి జిల్లా సీకే పల్లి మండలం వెల్దుర్తి సమీపంలో చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వెల్దుర్తి, గంగినేపల్లి తండాలకు, ఎర్రోనిపల్లి, బ్రాహ్మణపల్లి, చిన్నప్పరెడ్డిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వైఎస్సార్ జిల్లాలో గండికోట జలాశయం, మైలవరం జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. పైడిపాలెం, వామికొండ, సర్వారాయ సాగర్ జలాశయాలకు వరద వచ్చి చేరుతోంది. నెల్లూరు నగర శివారులోని ఆటోనగర్, చంద్రబాబునగర్, తల్పగిరి కాలనీ, జొన్నవాడ రోడ్డు, పొట్టేపాలెం కలుజు ప్రాంతాల్లో వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం రాత్రి వర్షానికి పంట తడిసింది. ఆరబోసిన మొక్కజొన్న, వేరు శనగ తడిసి రైతులకు నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో వరి పంట నీటమునిగింది.
వర్షాలపై చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో గురువారం ఉదయం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు అధికారులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలు, నీటి నిర్వహణ చర్యలను ఇరిగేషన్ అధికారులు వివరించారు. తీరం దాటిన సందర్భంగా మరో 24 గంటలు భారీ వర్షాలు ఉంటాయనే హెచ్చరిక నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
మరో 24 గంటలు వర్షాలు
చెన్నైకి సమీపంలో వాయుగుండం తీరందాటి ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారిందని, రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలోని అనంతపురం, కడప, చిత్తూరులో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.