. విభజన హామీలకు పంగనామాలు
. అన్నదాతలపై యుద్ధం సరికాదు
. ఈడీ, సీబీఐతో ప్రతిపక్షాలపై దాడులు
. బలపడుతున్న ఇండియా కూటమి
. ఏపీలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ ఉమ్మడి కార్యాచరణ
. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ
విశాలాంధ్ర బ్యూరో-దిల్లీ/అమరావతి : విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తెలుగు ప్రజలకు మొదటి శత్రువు బీజేపీనేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ నిశితంగా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. దిల్లీలో బుధవారం సీపీఐ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అజీజ్ పాషాతో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు. కడప స్టీల్ప్లాంట్, బయ్యారం స్టీల్ప్లాంట్, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, ప్రత్యేక హోదా తదితర విభజన హామీలన్నిటికీ ప్రధాని మోదీ పంగనామాలు పెట్టారని నారాయణ విమర్శించారు. తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిన ప్రథమ శత్రువు బీజేపీ కాళ్లు పట్టుకునేలా ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు దిగజారడం తగదన్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల ఆధారంగా దేశవ్యాప్తంగా విపక్ష ఇండియా కూటమి బలపడుతుండగా… ఎన్డీఏ బలహీనపడుతోందని వివరించారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం బలంగా నిలబడుతున్నారన్నారు. బీహార్ సీఎం నితీశ్కుమార్ ఎన్డీఏ గూటికి చేరినప్పటికీ ఇండియా కూటమి బలోపేతమైందన్నారు. పొత్తుల్లో భాగంగా కేరళలోని వయనాడ్లో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి అనీ రాజా పోటీ చేస్తారని చెప్పారు. తమిళనాడు, బీహార్లోనూ సీపీఐ పోటీ చేసే సీట్లపై సానుకూల చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. బీజేపీపై తమ పోరాటం ఉంటుందని పునరుద్ఘాటించారు. కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే ఉన్నాయని, అక్కడ ఎవరు గెలిచినా కేంద్రంలో బీజేపీ రాకూడదన్నదే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. ఏపీలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ కలిసి అవగాహనకు వచ్చాయని స్పష్టంచేశారు. ప్రజా సమస్యలతోపాటు రాజకీయపరంగా, ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ మేరకు అనంతపురంలో ఇప్పటికే బహిరంగసభను ఉమ్మడిగా నిర్వహించామని గుర్తుచేశారు. మార్చి 1వ తేదీన తిరుపతి కేంద్రంగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా ప్రత్యేక హోదాపై బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, అమరావతి ప్రాంతాల్లోనూ ఉమ్మడిగా సభలు జరుగుతాయని వివరించారు. రాబోయే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ కలిసి ఒక వేదికగా ఉండాలని నిర్ణయించామని, సీట్ల అంశాలపై తర్వాత చర్చిస్తామన్నారు. తమ కలయిక ద్వారా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మార్పు కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మద్యం కుంభకోణంలో అసలు నిందితులను వదిలి కేజ్రీవాల్ బృందాన్ని బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తున్నదని నారాయణ విమర్శించారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను వినియోగించి విపక్షాలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కారు ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. సెక్షన్ 17ఏ కత్తి పెట్టి టీడీపీ నేత నారా చంద్రబాబును లొంగదీసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్ ఎప్పుడో కేంద్రానికి లొంగిపోయారని ఎద్దేవా చేశారు. రూ.45 వేల కోట్లు దోచిన 11 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయనపై చర్యలేవని నిలదీశారు. పిరికిపంద రాజకీయాలు చేసేవారు రాజకీయాల్లో ఉండటం సరికాదన్నారు. సొంత ప్రయోజనాల కోసం…రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టొద్దని హితవు పలికారు. విభజన హామీలు అమలు చేయకపోయినా బీజేపీ కాళ్లు పట్టుకోవడం దారుణమన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి బీజేపీ, చంద్రబాబు, జగన్కు వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ ప్రజా సమస్యల్ని వదిలేసి రాజకీయాలు మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు. అన్నదాతలపై యుద్ధం సరికాదని, రాముడు, కృష్ణుడిని అడ్డుపెట్టుకొని ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నిత్యం దేవుళ్లను ఆరాధించే మోదీ… సమస్యల్లో ఉన్న ప్రజలను ఎందుకు కలవరని సూటిగా ప్రశ్నించారు. విగ్రహాలు తెచ్చానని చెప్పుకునే మోదీ… లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నల్లకుబేరులను ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నారో సమాధానమివ్వాలని నిలదీశారు. ప్రజలకు మేలు చేసిన వారైతే ఇన్ని జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం లేదన్నారు. రైతులు ఆందోళనలో ఉంటే జంతువులను వేటాడినట్లు వేటాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజీజ్ పాషా మాట్లాడుతూ దిల్లీలో రైతుల ఉద్యమం చాలా ప్రతిష్ఠాత్మకంగా కొనసాగుతోందన్నారు. రైతుల డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కమిటీలతో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు.