Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

దౌత్యానికే మా మద్దతు

. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదు
. బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని మోదీ

కజాన్‌ : భారతదేశం దౌత్యం, చర్చలకు మద్దతు ఇస్తుందని, యుద్ధానికి కాదని ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. రష్యా వేదికగా జరుగుతోన్న బ్రిక్స్‌ సదస్సులో నరేంద్రమోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియా కల్లోల పరిస్థితులు, ఆర్థిక అస్థిరతలు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి అనేక సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని సరైనమార్గంలో తీసుకువెళ్లడంలో బ్రిక్స్‌ సానుకూలపాత్ర పోషిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘కోవిడ్‌ వంటి సవాళ్లను ఎదుర్కొన్నట్టుగానే… మనం భవిష్యత్తు తరాలకు కొత్త అవకాశాలు సృష్టించగలం. ఉగ్రవాదం, ఉగ్ర సంస్థలకు వనరులను సమకూర్చడాన్ని కట్టడి చేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించొద్దు. ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంగానే చూడాలి. మన దేశాల్లో యువతను అతివాద భావజాలం వైపు మరల్చే చర్యలను అడ్డుకునే విషయంలో చురుగ్గా వ్యవహరిం చాలి. సైబర్‌ సెక్యూరిటీ, సురక్షిత కృత్రిమ మేధ కోసం అంతర్జాతీయ నియంత్రణలను తీసుకువచ్చేందుకు మనమంతా కృషి చేయాలి’ అని సూచించారు. బ్రిక్స్‌ భాగస్వాములుగా ఇతర దేశాలను ఆహ్వానించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయంలో వ్యవస్థాపక సభ్య దేశాల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలన్నారు. ఐరాస భద్రతా మండలి, ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు రావాల్సిన ఆవశ్యకతను మోదీ గుర్తుచేశారు. గ్లోబల్‌ సౌత్‌(వర్ధమాన దేశాలు) దేశాల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించారు. భిన్నమైన ఆలోచనాధోరణులు, భావజాల సమ్మేళనంగా ఏర్పడిన బ్రిక్స్‌… ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఇది ‘బ్రిక్స్‌’ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు. సభ్య దేశాల నాయకులు దిగిన గ్రూప్‌ ఫొటోను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాతో బ్రిక్స్‌ కూటమి ఏర్పాటైంది. ఇప్పుడు దాన్ని విస్తరించి ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యూఏఈలకూ సభ్యత్వం ఇచ్చారు. కూటమి విస్తరణ తర్వాత జరిగిన తొలి శిఖరాగ్ర సదస్సు ఇదే కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img