ఇద్దరి సస్పెన్షన్
ముగ్గురు ఉద్యోగుల తొలగింపు
విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి : తిరుపతి లోక్సభ ఉపఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన నకిలీ ఓటర్ ఐడీ కార్డులు బాగోతం కొంతమంది అధికారుల మెడకు చుట్టుకుంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయమై తీవ్రంగా స్పందించడంతో అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అప్పటి తిరుపతి మున్సిపల్ కమిషనర్, ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీఎస్ గిరిషాపై సస్పెన్షన్ వేటు పడిరది. నకిలీ ఓటరు ఐడీ కార్డుల వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉందో అధికారం యంత్రాంగం నిగ్గు తేలుస్తోంది. నకిలీ ఓటర్ కార్డులు తయారీ విషయమై మున్సిపల్ కమిషనర్ హరిత ఫిర్యాదు మేరకు తిరుపతి తూర్పు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో వెల్లడైన అంశాల మేరకు కొంతమంది అధికారులపై ఎన్నికలసంఘం చర్యలు తీసుకుంటోంది. అప్పట్లో తిరుపతి అర్బన్ రెవెన్యూ కార్యాలయం ఆధారంగా నకిలీ ఓటర్ కార్డులు తయారు చేసినట్లు ప్రాథమికంగా అధికారులు తేల్చారు. దీంతో కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారిగా ఉన్న జయ రాములు, అప్పటి తిరుపతి డిప్యూటీ తహసీల్దార్ విజయభాస్కర్లను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. కంప్యూటర్ ఆపరేటర్లుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ప్రతాప్ నాయక్, శివ కుమార్, విజయ్ కుమార్లను ఉద్యోగాల నుండి తొలగించారు. కేసు దర్యాప్తు జరిగే కొద్దీ ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. అధికారులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు ఈ నకిలీ ఓటర్ కార్డు స్కామ్లో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులపైనా కేసుల నమోదుకు ఎన్నికల సంఘం సమాయత్తమైంది. దర్యాప్తు పూర్తి అయ్యేసరికి దాదాపు 20 మందికి పైగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో పాటు రాజకీయ నాయకులు నిందితులుగా తేలే అవకాశం ఉంది. దీంతో అధికార పార్టీ నాయకులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎన్నికల సంఘం నకిలీ ఓటర్ కార్డులపై తొలుత తిరుపతి లోక్సభ ఉపఎన్నికలపై దృష్టి సారించడం, వెంటనే చర్యలకు పూనుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇటు అధికారులలో అటు రాజకీయ నాయకులలో గుబులు పుడుతోంది.