. ఉచిత ఇసుకను ఎర్రమట్టి దిబ్బలా మార్చొద్దు
. ఆగస్టులో పోలవరం నిర్వాసితుల ప్రాంతాల్లో పర్యటన
. అన్యాక్రాంతమైన 1.75 లక్షల ఎకరాలపై సమగ్ర విచారణ
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర`గుంటూరు కలెక్టరేట్: ఉచిత ఇసుక విధానాన్ని భీమిలిలో దోపిడీకి గురవుతున్న ఎర్రమట్టి దిబ్బ పాలసీగా మార్చొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విశాఖ జిల్లా భీమిలిలో జరిగే ఎర్రమట్టి దిబ్బ తవ్వకాల తీరును ఎండగట్టారని, ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజులైనా అక్కడి తవ్వకాలను నిలువరించలేక పోయిందని పేర్కొన్నారు. అక్రమార్కులు అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకుని తవ్వకాలు కొనసాగిస్తున్నారా లేక అధికారులను లోబరచుకొని తవ్వకాలు చేస్తున్నారా అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. గుంటూరు మల్లయ్యలింగం భవన్లోని వీఎస్కే హాలులో బుధవారం జరిగిన సీపీఐ గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరైన రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలపై కేబినెట్ సమావేశంలో టీడీపీ ప్రభుత్వం చర్చించడం శుభపరిణామమని రామకృష్ణ అన్నారు. రైతులకు ఇబ్బందికరంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దును స్వాగతిస్తున్నామన్నారు. ఈ చట్టాన్ని సీపీఐ, రైతు, ప్రజాసంఘాలు, న్యాయవాదులు మొదటి నుంచి వ్యతిరేకించినప్పటికీ జగన్ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లిందని ఆయన గుర్తుచేశారు. ఉచిత ఇసుక విధానం క్షేత్రస్థాయి వరకు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాకాకుండా పాలసీ పేరుతో దోపిడి జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, ఉచిత ఇసుక పాలసీ కూడా ఎర్రమట్టి దిబ్బ పాలసీలా మారుతుందని హెచ్చరించారు. ఉచిత ఇసుక పాలసీలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారని, అది ఎంతవరకు అమలు జరుగుతుందో వేచిచూద్దామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.75 లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్లు సాక్షాత్తు ముఖ్యమంత్రి చెబుతున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని, భాగస్వాములైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. పేద, మధ్యతరగతి, చిన్న, సన్నకారు రైతులకు చెందిన భూములను వారికిచ్చి న్యాయం చేసేందుకు నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత పోలవరం ప్రాజెక్టు అంటే కేవలం కాపర్ డ్యామ్, డయాఫ్రం వాల్ మాత్రమే కాదని, నిర్వాసితులు ఉన్నారనే విషయాన్ని గ్రహించాలని ప్రభుత్వానికి రామకృష్ణ సూచించారు.
ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను సరిదిద్దవచ్చని, మరి నిర్వాసితుల సంగతేమిటని ఆయన ప్రశ్నించారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారంపై ముఖ్యమంత్రి స్పందించకపోవడం సమంజసం కాదన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నిర్వాసితులకు న్యాయం చేసేందుకు, వారి జీవితాలను మెరుగుపరిచేందుకు సీపీఐ సిద్ధమైందని, దీనికోసం కలిసి వచ్చే రైతుసంఘాలు, గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకుని ఆగస్టు మొదటి వారంలో పోలవరం నిర్వాసితుల ప్రాంతాలలో పర్యటించి సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు.
ఇక ప్రజాచైతన్య కార్యక్రమాలు: ముప్పాళ్ల
బీజేపీ ప్రజా, కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై, ప్రజల మధ్య విభజన తెచ్చి రాజ్యాంగ, లౌకిక భావాలు దెబ్బతీసే వైఖరిని వ్యతిరేకిస్తూ రానున్న కాలంలో దేశవ్యాప్తంగా ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. 2024 డిసెంబర్ 26వ తేదీ నాటికి సీపీఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శత వార్షికోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో, పారిశ్రామికీరణలో, దేశ, రాష్ట్ర పురోభివృద్ధికి, ప్రజల కోసం ఈ వంద సంవత్సరాల కాలంలో సీపీఐ పోరాట ఫలాలు, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. దీని కోసం లక్ష మంది రెడ్ షర్ట్ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో పార్టీ పటిష్టతకు, ప్రజా ఉద్యమాల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, జిల్లా కమిటీ సభ్యుడు చిన్ని తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.