కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దు: సుప్రీం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు రaలక్్ ఇచ్చింది. ఆయనపై ఆంక్షలు విధించింది. జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆదేశించింది. పాల్వాయిగేటు టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఇటీవల దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. ఈనెల 6 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు వల్ల కౌంటింగ్ కూడా సక్రమంగా జరిగే అవకాశం లేదని శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ ఏజెంట్గా కూర్చున్న తనపై పిన్నెల్లి హత్యా యత్నం చేశారని, ఆ తర్వాత కూడా చంపు తానని బెదిరించారని తెలిపారు. ఈనెల 6వ తేదీ వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల తనకు పిన్నెల్లితో ప్రాణహాని ఉందని, కౌంటింగ్ రోజు ఆయన హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం పిన్నెల్లిని మంగళవారం కౌంటింగ్ హాలులోకి వెళ్లవద్దని ఆదేశించింది.
‘పోస్టల్ బ్యాలెట్’పై జోక్యం చేసుకోలేం
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ల ఓటరు డిక్లరేషన్కు సంబంధించిన ‘ఫాం-13ఏ’ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు… ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర (సీలు) లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటవుతాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న జారీచేసిన ఉత్తర్వులపై వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయిం చింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ పార్టీ శనివారం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలన్న ఆ పార్టీ రిట్ పిటిషన్పై విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికార పార్టీ వాదనలను తిరస్కరిస్తూ జూన్ 1న తీర్పు చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, పిటిషనర్కు ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల కమిషన్కు విన్నవించుకోవాలని జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్లతో కూడిన హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం వైసీపీ పిటిషన్ను తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని, సీలు, హోదా అవసరం లేదని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. ఇదే అంశంపై విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తరపున ఆయన న్యాయవాది గుంటూరు ప్రభాకర్ సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏదైనా ఉత్తర్వులు జారీచేసే ముందు కోర్టు తన వాదనలు వినాలని కోరారు.
చెవిరెడ్డి మోహిత్రెడ్డి రీపోలింగ్ పిటిషన్ కొట్టివేత
మరోవైపు చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చంద్రగిరి నియోజక వర్గంలో ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్ల విషయాన్ని మరోసారి పరిశీలించాలని, నాలుగు పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగినందున వాటిలో రీపోలింగ్ జరపాలని ఆయన పిటిషన్ వేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీనిలో జోక్యం చేసుకునేందుకు కారణాలు కూడా ఏమీ కనిపించట్లేదని పేర్కొంది.