సీఎం చంద్రబాబు నాయుడు
విశాలాంధ్ర`కుప్పం : పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తన సొంత నియోజక వర్గం కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు. దీనికోసం ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలన్నారు. సింపుల్ గవర్నమెంట్… ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని తెలిపారు. గత పాలనకు, ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండబోతోందన్నారు. బలవంతపు జనసమీకరణతో పెద్ద పెద్ద సమావేశాలు, భారీ కాన్వాయ్లతో సైరన్ల మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండవని చెప్పారు. సాయంత్రం 6 గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు కూడా ఇప్పటికే చెప్పానని అన్నారు. అధికారులు కూడా వేగంగా స్పందించాలని, సమర్థవంతంగా కార్యక్రమాలు ఉండాలని సీఎం సూచించారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రోద్భలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తివేయాలని, రౌడీయిజం చేసేవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. గత ఐదేళ్లూ అధికారులు మనసు చంపుకుని పని చేశారని, వైసీపీ నేతల పైశాచిక ఆనందానికి కొందరు అధికారులు సహకరించారని తెలిపారు. ‘నా సొంత నియోజకవర్గానికి నేను రాలేని, మాట్లాడలేని పరిస్థితిని గత ఐదేళ్లలో కల్పించారు. నా పైనా హత్యాయత్నం కేసు పెట్టారు. 2019 వరకు నాపై ఒక్క కేసు కూడా లేదు. కానీ గత ఐదేళ్లలో అక్రమ కేసులు అనేకం పెట్టారు. ప్రభుత్వ వ్యవస్థలు నాశనం అవ్వడంపై నేను చాలా బాధపడ్డాను. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలి. ప్రణాళికలు సిద్ధం చేయండి… మార్పు కనిపించాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు. నియోజకవర్గంలో కొన్ని సమస్యలు సవాళ్లు విసురుతున్నాయని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికీ తాగునీరివ్వడంతో పాటు హంద్రి`నీవా కాల్వ పనులు పూర్తికి ప్రణాళిక సిద్ధ చేయాలన్నారు. వ్యవసాయంలో మెరుగైన విధానాలు తీసుకురావాలని, డైరీ, మిల్క్, సిల్క్, హనీ ఉత్పత్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కుప్పానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెస్తామని, ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా కుప్పాన్ని ఎడ్యుకేషన్ హబ్ చేస్తామని ఆయన చెప్పారు. యువతలో నైపుణ్యాన్ని లెక్కించేందుకు, అవకాశాలు కల్పించేందుకు, వారిలో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రైతులకు సబ్సిడీలు అందించడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.