అక్రమార్కులతో ఉద్యోగులు… అధికారుల కుమ్మక్కు
రికార్డుల తారుమారు… అక్రమంగా బదలాయింపు
కోట్ల రూపాయలు పోగేసుకుంటున్న వైనం
ఏలూరు జిల్లా అయ్యప్ప రాజుగూడెంలో దందా
విశాలాంధ్ర – లింగపాలెం : సాగు భూమి లేని వారికి ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న భూములను ఇచ్చి పేద రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆశయం నీరుగారుతోంది. పేదల భూములను పెద్దలు స్వాహా చేస్తున్నారు. ఇందుకు కొందరు ఉద్యోగులు… అధికారులు అండదండలు అందిస్తూ ప్రభుత్వ భూములను బడాబాబులకు అక్రమంగా బదలాయిస్తున్నారు. భూ రికార్డులనే తారుమారు చేసేసి… కోట్ల రూపాయలు సంపాదించేస్తున్నారు. ఏలూరు జిల్లా, అయ్యప రాజుగూడెంలో నిరుపేదలకు ఇచ్చిన ఈ భూముల వ్యవహారం దోచుకున్న వారికి దోచుకున్నంతగా ఉంది. గ్రామంలో ఉన్న దాదాపు 15 వందల ఎకరాల నిరుపయోగంగా ఉన్న భూమిని నాలుగు దశాబ్దాల క్రితం లేని నిరుపేదలకు పంపిణీ చేయడం ప్రారంభించారు. ముందుగా 600 ఎకరాలను దాదాపు 132 మంది పేదలకు ఐదు ఎకరాల చొప్పున పంపిణీ చేశారు. అనంతరం పదేళ్ల తర్వాత మరో 600 ఎకరాలను దాదాపు 340 మందికి పంపిణీ చేశారు. సాగు భూములకే కాకుండా నివాసాలకు, రహదారులకు కొంత భూమిని కేటాయించారు. సారవంతమైన ఈ భూములను పేదలు సాగులోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని సాగుదారులకు అనేక సదుపాయాలు కల్పించారు.ఇదంతా బాగానే ఉన్నా… తదనంతర కాలంలో జరిగిన… జరుగుతున్న అనేక పరిణామాలు, సంఘటనలు వివాదాలకు దారితీస్తున్నాయి. రెవెన్యూ శాఖలోని కొందరు ఉద్యోగులు, మరికొందరు అధికారులు డబ్బులకు ఆశపడి రికార్డులు తారుమారు చేసి దోచుకున్నంత దోచేయడమే కాకుండా ఇప్పటికీ దొంగ పత్రాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి. అసైన్మెంట్ నిబంధన ప్రకారం ఒకరికి ఇచ్చిన భూమిని విక్రయించడానికి వీలు లేదు. అయితే సారవంతంగా ఉన్న ఈ భూములపై కొందరు కబ్జాదారుల కన్ను పడటంతో లోపాయికారీ విక్రయాలు జరిగాయి. పేదల అవసరాలను ఆసరాగా తీసుకుని వారికి ఆశలు కల్పించి అనేక మంది నుంచి భూములను తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. అప్పట్లో ఎకరం రూ.10 నుంచి రూ.50 వేలకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇక్కడ భూముల విలువ చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. తోటలు వేసిన ఎకరం భూమి ఖరీదు రూ.35 లక్షలు పలుకుతోంది. తోటలు వేయని భూములు ఖరీదు ఎకరం రూ.20 లక్షల వరకు ఉంది. ఎన్ని లక్షల పెట్టినా ఆదాయం పుష్కలంగా రావటంతో కొనుగోలుదారులు వెనకాడటం లేదు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములలో దాదాపు 500 ఎకరాలు అనర్హుల స్వాధీనంలో ఉన్నాయనేది అంచనా. వీటి ఖరీదు దాదాపు రూ.125 కోట్లు ఉంటుందని స్థానికులు అంటున్నారు. అన్యాక్రాంతమైన ఈ భూమి నుంచి కబ్జాదారులకు పుష్కలంగా లక్షల్లో ఆదాయం వస్తోంది. దీంతో అక్రమార్కులంతా ఆ భూములను కాపాడుకునేందుకు ఉద్యోగుల, అధికారుల అండదండలు తీసుకుంటున్నారు. అక్రమ కొనుగోళ్లను నివారించాల్సిన కొందరు రెవెన్యూ శాఖ సిబ్బంది, అధికారులు వీటిని ప్రోత్సహించి డబ్బు కోసం ఒకరి పేరుతో ఉన్న రికార్డులను మరొకరికి మార్చేశారు… మార్చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారనేది బహిరంగ రహస్యం. 2008`2015 మధ్య కాలంలో ఇక్కడ పనిచేసిన వారిలో ఒక రెవెన్యూ కార్యదర్శి చేసిన అవినీతి బాగోతంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆ ఉద్యోగి పని చేసిన సమయంలోని తేదీలతో ఇప్పటికీ తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒక్క ఉద్యోగి అవినీతికి పాల్పడి రైతుల నుంచి కోటి రూపాయలకు పైగా సొమ్ము కాజేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉద్యోగి ఇప్పుడు వేరే మండలంలో పని చేస్తున్నాడు. అప్పట్లో ఆన్ లైన్ విధానం లేకపోవడం వల్ల రెవెన్యూ కార్యదర్శి సూచించిన వారికి తహసీల్దార్ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆర్డీవో హక్కు బుక్లు ఇచ్చేవారు. అవినీతికి పాల్పడిన ఉద్యోగి తన ఫోర్జరీ సంతకాలతో భూములు కొనుగోలు చేసిన అక్రమార్కులకు పత్రాలు అందించినట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆన్ లైన్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత దొంగ పత్రాలతో పాస్ బుక్లు, టైటిల్ డీడ్లు, దస్త్రాల్లో నమోదయిన వారికి ఆన్ లైన్లో పేర్లు నమోదు చేశారు. 2021 నుంచి 2022 వరకు జరిగిన ఆన్ లైన్ నమోదులో రూ.కోటికి పైగా డబ్బులు చేతులు మారాయని బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కొందరు దళారుల పాత్ర కూడా ఉంది. ఇప్పటికీ అక్రమాలు జరుగుతూనే ఉన్నాయని గ్రామంలోని పేద రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ అసైన్మెంట్ల బాగోతాన్ని వెలికి తీయడం ఉన్నతాధికారులకు పెద్ద కష్టమేమీ కాదు. ఒక ఉద్యోగిని లేదా ఒక అధికారిని ప్రశ్నించినా, దస్త్రాలను తనిఖీ చేసినా అవినీతి వెలుగులోకి వస్తుంది. పేదల ఆర్థికాభివృద్ధి కోసం ఇచ్చిన ఈ భూములు అన్యాక్రాంతం కావడం వల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అర్థం లేకుండా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. పేదల నుంచి కొనుగోలు చేసిన వారు ఈ భూముల ద్వారా వచ్చిన ఫల సాయంతో ఎన్నో రెట్లు ఆర్థికంగా బలపడ్డారు. ఈ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడం వల్ల కబ్జాదారులకు జరిగే నష్టమేమీ ఉండదు. పైగా కబ్జాదారుల్లో ఎక్కువ మంది ఇతర ప్రాంతాల వారే ఉన్నారు. ఇప్పుడు కూడా కొందరు రెవెన్యూ కార్యదర్శులు ఇంచార్జ్లుగా చేస్తూ బోరులు వేయిస్తామంటూ వేల రూపాయలు తీసుకొని ఇబ్బంది పెడుతున్న సంఘటనలూ ఉన్నాయి. ఉన్నతాధికారులు వీటన్నిటిపై దర్యాప్తు చేయాలని, అనర్హుల స్వాధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకొని పేదలకు ఇవ్వాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయ్యపరాజుగూడెంలోని భూ బాగోతంపై కలెక్టర్ దర్యాప్తు చేపడితే వాస్తవాలు వెలుగు చూసి అవినీతిని అరికట్టవచ్చని వారంటున్నారు.