నీతి ఆయోగ్ సమావేశానికి ప్రతిపాదనలు
రాష్ట్ర అత్యవసర మంత్రివర్గ సమావేశం తీర్మానం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొత్త డయాఫ్రమ్వాల్ నిర్మాణానికి రాష్ట్రమంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. గురువారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో అత్యవసర మంత్రివర్గ సమావేశం జరిగింది. తొలుత ఏపీకి ఆర్థిక చేయూత ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానించింది. పోలవరం నిర్మాణాన్ని కేంద్రమే చేపడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో ఈనెల 27న దిల్లీలో జరిగే నీతిఆయోగ్ సమావేశానికి నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అనుకూలంగా ప్రతిపాదనలు పంపాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న సంగతి విదితమే. ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్కు తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో మరమ్మతులు చేసినా గ్యారెంటీ ఇవ్వలేమని, ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని విదేశీ నిపుణుల కమిటీ ఇటీవల తేల్చి చెప్పింది. దీంతో మంత్రివర్గ సమావేశం తీర్మానం కాపీని ఆమోదం కోసం నీతి ఆయోగ్కు పంపనున్నట్లు సమాచారం. అంతేకాకుండా పోలవరం ఎత్తు తగ్గించకుండా 45.06 అడుగులు నిర్మించాలని, నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలని కోరుతూ మంత్రివర్గ సమావేశం మరో తీర్మానం చేసినట్లు తెలిసింది. మంత్రుల పేషీల్లో ఎంత మంది సిబ్బందిని నియమించుకోవాలి? ఎన్ని పోస్టులు మంజూరు చేయాలి? వారి జీతభత్యాల గురించి కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. పోస్టుల మంజూరుపై ఒకటి, రెండు రోజుల్లో జీఓ విడుదల చేయని పక్షంలో పేషీల్లో పనిచేసే ఉద్యోగులకు ఆగస్టులో జీతాలు వచ్చే పరిస్థితి ఉండదనే అభిప్రాయాన్ని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో పాటు నామినేటెడ్ పోస్టులను ఆగస్టు మొదటి వారంలో భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని మంత్రులు కోరినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ఈనెల 26తో ముగియనుండటంతో 27న గవర్నర్ సమావేశాలను ప్రోరోగ్ చేయనున్నారు. 29న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్స్ తీసుకురావాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం జగన్ దిల్లీలో చేపట్టిన దీక్షపైనా, దానికి మద్దతు తెలిపిన ఇండియా ఐక్యసంఘటన పార్టీల అంశంపైనా చంద్రబాబు మంత్రులతో చర్చించినట్లు తెలిసింది.