బీహార్లో కత్తులుదూస్తున్న అధికార, విపక్ష కూటములు
పాట్నా : బీహార్లో ‘ప్రత్యేక హోదా’ అంశంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్పై ఆ రాష్ట్రంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహాఘట్బంధన్ కత్తులు దూస్తున్నాయి. 14వ ఆర్థిక సంఘం ఆ నిబంధనను రద్దు చేసినందున ఇకపై ప్రత్యేకహోదా మంజూరు చేయడం సాధ్యం కాదని కేంద్రం అభిప్రాయపడుతున్న సంగతి విదితమే. విపక్ష మహాఘట్బంధన్లో భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ శుక్రవారం ఇదే అంశంపై బీజేపీ-జేడీ(యు) కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో మిత్రపక్షం (జేడీయూ) పై ఆధారపడి ఉన్నప్పటికీ జేడీ(యూ) లేవనెత్తిన డిమాండ్ను బీజేపీ అంగీకరించకపోవడాన్ని తప్పుబట్టారు. ఇంతకంటే పెద్ద హాస్యాస్పద విషయం మరొకటి ఉండదని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీ(యు) గత నెలలో జరిగిన తన జాతీయ కార్యవర్గ సమావేశంలో బీహార్కు ప్రత్యేక కేటగిరీ హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ రూపంలో తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ తీర్మానం ఆమోదించడాన్ని ఆమె ప్రస్తావిస్తూ… ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ పంచన చేరిన జేడీయూ పట్ల ప్రధాని కొంత గౌరవం చూపించాలని ఎద్దేవా చేశారు. రాబోయే కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర అంచనాలపై ఆర్థికశాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య దిల్లీలో జరిగి సమావేశం గురించి బీజేపీకి చెందిన మరో ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాను ప్రశ్నించగా… సూటిగా సమాధానం ఇవ్వకుండా దాట వేశారు. ‘‘తాను వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) కోరుకుంటున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. బీహార్ కూడా అభివృద్ధి చెందినప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇది అవసరం’’ అని చెప్పుకొచ్చారు. కాగా ప్రత్యేక హోదా డిమాండ్ను గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విస్మరించిందని… మోదీ బీహార్కు దానిని నెరవేరుస్తారని రాష్ట్ర మంత్రి, జేడీయూ సీనియర్ నేత శ్రవణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామి లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) కూడా ప్రత్యేక హోదా డిమాండ్కు మద్దతుగా ముందుకు వచ్చింది. ఆ పార్టీ ఎంపీ అరుణ్ భారతి పీటీఐతో మాట్లాడుతూ… ‘‘మా పార్టీ మొదటి నుండి బీహార్కు ప్రత్యేక హోదాకు మద్దతుగా ఉంది. ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో కొంత సహాయం చేస్తారని మేము విశ్వసిస్తున్నాము’’ అన్నారు. కాగా ఇంతలో, మహాఘట్బంధన్కు నాయకత్వం వహిస్తున్న ఆర్జేడీ మాత్రం అధికాం ఎన్డీఏ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఆర్జేడీ ఎమ్మెల్యే భాయి వీరేంద్ర మాట్లాడుతూ… కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ బీజేపీ, జేడీ(యూ)లు అధికారాన్ని పంచుకుంటున్నాయని… అవసరమైన చర్యలు తీసుకోకుండా ఇంకా డిమాండ్లు లేవనెత్తుతున్నారన్నారు. ప్రజలను మూర్ఖులుగా భావిస్తున్నారా అని ప్రశ్నించారు. 2000లో బీహార్ను విభజించినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న రబ్డీదేవి ప్రభుత్వం మొదట ప్రత్యేక హోదా డిమాండ్ లేవనెత్తిందని తెలిపారు.