. అందరికీ మంచి చేశా… ఆదరించండి
. కావలి సభలో సీఎం జగన్
విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు : అబద్ధాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 9వ రోజు శనివారం సాయంత్రం నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతుందని జగన్ చెప్పారు. పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉంటే… పేదల పక్షాన మీ బిడ్డ జగన్ ఉన్నాడని తెలిపారు. ఈ యుద్ధంలో తాను ఎప్పుడూ పేదల పక్షమేనని అన్నారు. మోసగాళ్లంతా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా అని ప్రజలను అడిగారు. మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయని, పేదల భవిష్యత్ను నిర్ణయించేది ఈ ఎన్నికలేనన్నారు. తన హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగిందని, ఈ మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. మ్యానిఫెస్టో కాపీలు చూపించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా?.
చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదని, బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటీ లేదని జగన్ ఆరోపించారు. మ్యానిఫెస్టో కాపీలు చూపించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. 30 ఏళ్ల క్రితమే సీఎంగా చేసిన చంద్రబాబు… తన గత పాలన చూసి ఓటేయండని అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. తన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేరన్నారు. ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు అభివృద్ధి చేసి ఉంటే ఇతర పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారని నిలదీశారు. ఎన్నికల్లో బూటకపు హామీలు ఇవ్వడం తప్ప పేదవాడికి మంచిచేశానని ఏ రోజైనా చంద్రబాబు చెప్పగలిగాడా అని అడిగారు. తమ హయాంలో రూ.2 లక్షల 70వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశామని జగన్ చెప్పారు. ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించానని, 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ ఆశీస్సులు కోరుతున్నానని చెప్పారు. మీ జగన్ ఇంటించికి పౌరసేవలు అందించాడన్నారు. చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలపెట్టడమేనని సీఎం జగన్ ధ్వజమెత్తారు.
మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడని ఆరోపించారు. 2014లో ఇదే కూటమి ఇంటింటికీ పంపించిన కరపత్రం గుర్తుందా?. ముఖ్యమైన హామీలు అంటూ మోసపు మాటలు గుర్తున్నాయా?. రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు చేశాడా?. ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు.. నిర్మించాడా?. ఎన్నికల మేనిఫెస్టోను మేము పవిత్ర గ్రంథంగా భావించాం. 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి. మరో ఐదేళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలి. ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది. మళ్లీ మోసం చేసేందుకు బాబు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు. సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నాడు.. నమ్మొద్దని సీఎం జగన్ చెప్పారు.