తాగుడికి బానిసల్ని చేసి… మందులిచ్చి మాన్పిస్తారా: నారాయణ
మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.గురువారం విజయవాడ దుర్గాపురంలోని ఓ మద్యం దుకాణంలో విక్రయాలను ఆయన పరిశీలించారు.
విశాలాంధ్ర-విజయవాడ : మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతన మద్యం పాలసీని అమలులోకి తెచ్చిన సందర్భంగా గురువారం విజయవాడ దుర్గాపురంలోని ఓ మద్యం దుకాణంలో విక్రయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలన్నింటినీ కేంద్రీకరించటం వల్ల అవినీతి జరిగేదని, ఇప్పుడు వికేంద్రీకరణ చేయటానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వం సరసమైన ధరలకి నాణ్యమైన మద్యం అని చెప్పడంలో అర్థం లేదన్నారు. ధర తక్కువగా ఉన్నా…ఎక్కువగా ఉన్నా మద్యం ఆరోగ్యాన్ని చెడగొట్టేదే కదా అని ఆయన అన్నారు. మద్యం విక్రయాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా గుర్తించి చాలా సంతోషంగా ఉందన్నారు. దరఖాస్తుల ద్వారా రూ.3వేల కోట్లు వచ్చాయని, డిపాజిట్ ద్వారా మరో రూ.3వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు. ప్రభుత్వం మద్యం విక్రయం ద్వారా ఆదాయం వస్తుందని భావిస్తోందే కానీ ప్రజాశ్రేయస్సు మాత్రం కాదన్నారు. అదేమంటే సెస్ వస్తుందని… దాన్ని ‘రిహాబ్లిటేషన్’కోసం వినియోగిస్తామని చెపుతోందన్నారు. బాగా తాగడం అలవాటు చేసి… తరువాత మందులిచ్చి తాగటం మాన్పిస్తామని చెప్పటం హాస్యాస్పదంగా ఉందని, అడుసుతొక్కనేలా కాలు కడగనేలా అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. మద్యం తాగించటం, రక్తం చెడిపోయిన తరువాత మందులిచ్చి బాగుచేయించటం, సెస్ డబ్బులు రిహాబ్లీటేషన్కి మళ్లించటం అంతా దండగా మారిన పనేనంటూ ప్రభుత్వ విధానాన్ని దుయ్యబట్టారు. నూతన మద్యం పాలసీ కొత్త సీసాలో పాత సారా చందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మద్యం ధరలు, ప్రభుత్వ విధానంపై స్థానికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. నారాయణ వెంట సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి, జి.ఈశ్వరయ్య ఉన్నారు.