. అప్పుడే మీడియా సంస్థల మనుగడ సాధ్యం
. ఉద్యోగులు, సిబ్బంది నిబద్ధత అనిర్వచనీయం
. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డి
. వైభవంగా విశాలాంధ్ర ఎంప్లాయీస్ యూనియన్ వజ్రోత్సవం
విశాలాంధ్ర – విజయవాడ : తాము పనిచేస్తున్న సంస్థను కాపాడుకోవటానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడటం…పని పట్ల నిబద్ధత కలిగి ఉండటం విశాలాంధ్ర ఉద్యోగుల సొత్తు అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డి కొనియాడారు. విశాలాంధ్ర ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పడి 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా విశాలాంధ్ర కార్యాలయం చంద్రం బిల్డింగ్లో బుధవారం యూనియన్ వజ్రోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ విశాలాంధ్ర సహకార సంస్థ విధానంలో ఏర్పడిరదని, దీనికి లాభాలు వచ్చినా… నష్టాలు వచ్చినా పాలుపంచుకునేది ఉద్యోగులేనన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారితేనే ఏ సంస్థ అయినా మనుగడ సాగిస్తుందని చెప్పారు. ప్రకటనలు ఎవరు ఇచ్చినా తీసుకోవచ్చని, ఆ ప్రకటనల్లో తప్పులు ఉంటే వార్తగా రాసే అవకాశం ఉందన్నారు. శక్తి కొలది ఇతర పత్రికలతో పోటీ పడాలన్నారు. ఏ చిన్న లాభం వచ్చినా… అది సంస్థ ఉద్యోగులకు, సంస్థ ఆధునీకరణ, విస్తరణకు వినియోగించాలని సూచించారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి పాలక మండలిలో ఎంప్లాయీస్ యూనియన్ తరపున ఒకరికి ప్రాతినిథ్యం కల్పించాలని ఆయన సూచించారు. ఉద్యోగులకు విశ్వాసం కలిగించే రీతిలో యాజమాన్యం వ్యవహరించాలన్నారు. ప్రపంచ ధనవంతుల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వ్యక్తుల పేర్లను పార్లమెంట్లో ప్రస్తావించకూడదని లోక్సభ స్పీకర్ ఆదేశించటం విడ్డూరంగా ఉందని శ్రీనివాస్రెడ్డి అన్నారు. కరోనా సమయంలో రోజుకు వెయ్యికోట్ల రూపాయల ఆదాయాన్ని అదానీ సంస్థలు ఆర్జించాయన్నారు. పేదలకు ఉపయోగపడేలా రాజ్యాంగం మార్చాలని డిమాండ్ చేయాల్సిన వామపక్షాలు….ఇప్పుడు కనీసం ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే స్థాయికి చేరాయని, అంటే బీజేపీ పాలనలో రాజ్యాంగానికి ఎలాంటి పరిస్థితి ఏర్పడిరదో అర్థమవుతోందని శ్రీనివాస్రెడ్డి అన్నారు. వామపక్ష పార్టీల ద్వారానే రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో అణు ఒప్పందం తప్పని యూపీఏ ప్రభుత్వం నుంచి వామపక్షాలు బయటకు వచ్చాయని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విషయం చెబుతోందన్నారు.
విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యాపారం, రాజకీయ ప్రయోజనాల కోసం విశాలాంధ్ర ఏర్పడలేదన్నారు. సామాజిక, సాంస్కృతిక చైతన్యం కోసం ఏర్పాటు చేశారన్నారు. ఎంతటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఉద్యోగులు ముందుండి సంస్థను కాపాడారని గుర్తు చేశారు. ఎంప్లాయీస్ యూనియన్, యాజమాన్యం సఖ్యతతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ విశాలాంధ్ర అభివృద్ధికి సంబంధించి విజ్ఞాన సమితికి ఎంత బాధ్యత ఉందో… అంతే బాధ్యత ఎంప్లాయీస్ యూనియన్పై కూడా ఉందన్నారు. పత్రికపై ప్రభుత్వాలు కక్ష కట్టినా దీటుగా ఎదుర్కొని నడిపారని, ఓర్పుగా ఉద్యోగులు పని చేశారని కొనియాడారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి కోశాధికారి జి.ఓబులేసు మాట్లాడుతూ ఉద్యోగుల సాధక బాధకాలను యాజమాన్యానికి అర్థం అయ్యేలా చెప్పటానికి యూనియన్ అవసరం ఉందన్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యూనియన్ పని చేయాలన్నారు. అభ్యుదయ సమాజమే విశాలాంధ్ర లక్ష్యమని, ప్రత్యామ్నాయ జర్నలిజాన్ని జాగత్త్రగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజాపక్షం దినపత్రిక సంపాదకులు మక్కెన సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిజానికే కాకుండా జర్నలిస్టులకు కూడా విశాలాంధ్ర ఎంప్లాయాస్ యూనియన్ నాయకత్వం వహించిందన్నారు. పత్రిక ముద్రణ కోసం డీటీపీ విధానాన్ని మొదటిసారి ప్రవేశపెట్టింది విశాలాంధ్ర పత్రికేనన్నారు. విశాలాంధ్ర ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పడిన పరిస్థితులు, ఎదురైన సమస్యలను సోదాహరణగా వివరించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ విశాలాంధ్ర అభివృద్ధికి ఏపీయూడబ్ల్యూజే పూర్తి సహకారం అందిస్తుందన్నారు. సీనియర్ పాత్రికేయులు ఎస్కే బాబు మాట్లాడుతూ యాజమాన్యం, యూనియన్ పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని విశాలాంధ్ర ఎంప్లాయీస్ యూనియన్లో పనిచేసిన సీనియర్ నాయకులను అతిథులు ఘనంగా సత్కరించారు. విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కూన అజయ్బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్ మేనేజర్ పి.హరినాథరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకటేశ్వరరావు, ఎం.మురళీకృష్ణ పాల్గొన్నారు. ముందుగా సీహెచ్ అజయ్కుమార్ శిష్యబృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అబ్బురపరిచాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రనాయక్, కోశాధికారి ఆర్.పిచ్చయ్య ఆలపించిన అభ్యుదయ గీతాలు, సీనియర్ పాత్రికేయులు రొమిలా ఆలపించిన పాట అందరినీ అలరించాయి. వజ్రోత్సవానికి విశాలాంధ్ర పూర్వ ఉద్యోగులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.