. 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ
. డిసెంబరు 10లోపు ప్రక్రియ పూర్తికి ప్రణాళిక
. ఆగస్టు నుంచి అన్న క్యాంటిన్ల పునరుద్ధరణ
. జులై 1 నుంచి రూ.4 వేల పెన్షన్
. ఏడు అంశాలపై త్వరలో శ్వేతపత్రాలు
. రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశ నిర్ణయాలు
. సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మెగా డీఎస్సీకి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర పడిరది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేసిన తొలి ఐదు సంతకాల ఫైళ్లకు సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయంలో దాదాపు మూడున్నర గంటలు కొనసాగిన మంత్రివర్గ భేటీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వాటి అమలుపై నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడ వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలని కేబినెట్ తీర్మానించింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛను రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందుంచారు. జులై ఒకటి నుంచి ప్రక్రియ ప్రారంభించి డిసెంబర్ 10లోపు 16,347 పోస్టులు భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. జులై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి అమలు చేస్తూ గత మూడు నెలలకు కలిపి మొత్తం రూ.7వేలు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయనున్నారు. గంజాయి నివారణకు హోంమంత్రి వంగలపూడి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హోం, రెవెన్యూ, ఆరోగ్య, గిరిజన శాఖ మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు కానుంది. గత ప్రభుత్వం కీలక అంశాల పట్ల అనుసరించిన నిర్లక్ష్యం, పాలనా తీరు వైఫల్యాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, మద్యం, మైనింగ్, ఆర్థిక అంశాలతో పాటు శాంతిభద్రతల అంశంపైనా శ్వేతపత్రాలు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అన్ని వర్గాలకు భరోసా కల్పించే విధంగా మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖమంత్రి కె.పార్థసారధి సోమవారం మీడియాకు వివరించారు.
డిసెంబరు 10లోగా మెగా డీఎస్సీ ప్రక్రియ
మెగా డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేయనున్న 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఎస్జీటీలు- 6,371, పీఈటీలు- 132, స్కూల్ అసిస్టెంట్లు- 7,725, టీజీటీలు- 1781, పీజీటీలు- 286, ప్రిన్సిపాల్లు – 52 పోస్టులు భర్తీ చేయనున్నారు. గత ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని, తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ అమలుకు వెంటనే చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడిరచారు. డీఎస్సీ నిర్వహణ ఇకపై నిరంతర ప్రక్రియగా ఉంటుందని మంత్రి మండలి నిర్ణయించినట్లు తెలిపారు. డిసెంబరు 10లోగా నియామక ప్రక్రియను పూర్తి చేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని మంత్రి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) 2022 రద్దు
ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం 2022 (యాక్టు సంఖ్య 27 ఆఫ్ 2023) రద్దు చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకొచ్చినట్లు గుర్తించామని మంత్రి తెలిపారు. సరైన అవగాహన లేని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అనవసరమైన సమస్యలు సృష్టిస్తారని తాము గ్రహించామని, నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యం ఉందని మంత్రి చెప్పారు. కొన్ని వివాదాస్పద నిర్ణయాల వల్ల ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ యాక్ట్ ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తర్వాత మధ్యంతర, జిల్లా, న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా నేరుగా పరిష్కారానికి కక్షిదారులు హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి కల్పించారని తెలిపారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలను అస్తవ్యస్తం చేసే ఈ చట్టాన్ని రద్దు చేయాలని, భూయజమాని ఒరిజినల్ డాక్యుమెంట్ పొందే అవకాశం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిపారు.
ఇకపై ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు తదితర పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ… ఇకపై ఎన్టీఆర్ భరోసా ఫించన్ పథకంగా పేరు మారుస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. పెన్షన్ పెంపుదల నిర్ణయంతో 28 కేటగిరీలకు చెందిన దాదాపు 66 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి రూ.33వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. ఈ మేరకు రూ.4 వేలకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ఏప్రిల్, మే, జూన్లకు పెరిగిన రూ. వెయ్యి రూపాయల చొప్పున కలిపి ప్రతి పింఛన్దారుకు మొత్తం రూ.7 వేలను జూలై 1వ తేదీన సచివాలయ ఉద్యోగులతో ఇంటివద్దనే అందించాలని మంత్రిమండలి నిర్ణయించిందని మంత్రి పార్ధసారథి చెప్పారు. దివ్యాంగులు, క్షయ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్ను రూ. 3 వేల నుంచి రూ.6 వేలకు పెంచారు. పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు ఇస్తున్న రూ.5 వేల పింఛన్ను రూ.15 వేలకు, కిడ్నీ, లివర్, బైలేట్రల్ ఎలిఫెంటాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న ఫించన్ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచినట్లు తెలిపారు. పెన్షన్ పెంపు వల్ల నెలకు రూ.819 కోట్ల అదనపు భారం పడనుండగా, బకాయితో కలిపి రూ.4,408 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉందని మంత్రి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్-2024 నిర్వహణ
ఏ దేశమైనా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన యువత ఎంతో అవసరమని, అందుకనుగుణంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్య గణన-2024 నిర్వహణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పార్ధసారిథి చెప్పారు. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 310 ఇంజినీరింగ్ కాలేజీలు, 1400 డిగ్రీ కాలేజీలు, 267 పాలిటెక్నిక్ కాలేజీలు, 516 ఐటీఐ కాలేజీల నుండి దాదాపు 4.4 లక్షల మంది యువత ఆయా కోర్సులు పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. ఈ యువతను జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పోటీ పడేలా చేసి ప్రపంచ యవనికపై మన ముద్ర ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని మంత్రివర్గం భావించిందన్నారు.