ఇండియా పక్షాలన్నీ ఒక్కటయ్యాయి
సీట్ల సర్దుబాటుపై దృష్టి కేంద్రీకరించాం
కూటమి అగ్రనాయకుల్లో నితీశ్ ఒకరు
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
పాట్నా: విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, రానున్న ఎన్నికల్లో ఐక్యపోరాటం ద్వారా మోదీ సర్కారును ఓడిస్తామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఓడిస్తేనే దేశాన్ని కాపాడుకోగలమని ఆయన అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కూడా ఇండియా కూటమి అగ్రనాయకుల్లో ఒకరని డి.రాజా చెప్పారు. ఇండియా కూటమిలో నితీశ్కుమార్ కీలకపాత్రపై జర్నలిస్టులు పదేపదే అడిగిన ప్రశ్నకు రాజా పైవిధంగా స్పందించారు. సోమవారం సాయంత్రం నితీశ్కుమార్తో సమావేశమైన రాజా మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో విజయం తర్వాతే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించాలన్న భావన ఇండియా కూటమిలోని అత్యధిక పార్టీల అభిప్రాయమని రాజా చెప్పారు. 1990లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలోనూ ఇలాగే జరిగిందని ఆయన గుర్తుచేశారు. ఇండియా కూటమి కన్వీనర్గా నితీశ్కుమార్ను ప్రకటిస్తున్నారా అని అడుగగా అది ఒక ఆలోచన మాత్రమేనని, ఒకవేళ అదే జరిగితే దానికి పెద్దగా అడ్డంకులు ఉంటాయని తాను భావించడం లేదని రాజా చెప్పారు. ‘ఇండియా కూటమిలో పెద్దనాయకులలో నితీశ్కుమార్ ఒకరు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయన చాలా అనుభవం గల రాజకీయవేత్త’ అని ఆయన అన్నారు. ఇండియా సంకీర్ణ కూటమిలో సీట్ల సర్దుబాటు గురించి ప్రశ్నించగా ‘బీహార్లో మా పార్టీ(సీపీఐ)కి గొప్ప చరిత్ర ఉంది. మంచి పట్టు కూడా ఉంది. అలాగే దేశంలోనూ పటిష్టమైన పార్టీ. అయితే, మేము చర్చలకు కూర్చున్న సమయంలో అన్ని భాగస్వామ్య పార్టీలతో అభిప్రాయాలు పంచుకుంటాం. భాగస్వాములందరికీ అవకాశం కల్పిస్తాం. అంతిమంగా ఇండియా కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతాం’ అని రాజా వివరించారు. నితీశ్కుమార్తో తాను కలిసినప్పుడు ఇవే విషయాలపై చర్చించామని, ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తోనూ ఫోన్లో మాట్లాడానని చెప్పారు. సీట్ల సర్దుబాటుపై జేడీయూ నాయకులు పదేపదే హడావుడి చేస్తున్నారు గదా అని అడుగగా ‘దీనిపై జాప్యం జరిగిందని నేను భావించడం లేదు. జాప్యం జరిగిందా…వేగంగా ముందుకు వెళుతున్నామా అనడానికి కొలబద్ధ ఏమీ లేదు. అన్ని అంశాలపై సరైన సమయంలోనూ చర్చలు జరుగుతాయి. అయితే అంతా మంచి జరగాలని మేము కోరుకుంటాం’ అని రాజా తెలిపారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ వచ్చేవారం చేపట్టే భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొంటారా అని విలేకరులు ప్రశ్నించగా గత భారత్ జోడో యాత్రకు ఆహ్వానించడంతో తాను శ్రీనగర్ సభలో పాల్గొన్నానని, ఈసారి కూడా ఆహ్వానిస్తారని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రంలోని బీజేపీకి ఇండియా సంకీర్ణమంటే భయం పట్టుకుందని, అందుకే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా పదేపదే తమపై విమర్శలు చేస్తున్నారని, తమ భాగస్వామ్య పార్టీలను భయపెట్టడానికి తరచూ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారని రాజా విమర్శించారు. ‘దేశ పరిరక్షణ కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిరచాల్సిన అవసరం ఉంది. అందుకే ఇండియా సంకీర్ణ కూటమి ఉమ్మడి నినాదం ‘దేశ్ బచావో…బీజేపీ హఠావో’ అని రాజా స్పష్టంచేశారు. సంకీర్ణ భాగస్వామ్య పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి…కాషాయ పార్టీని ఓడిరచాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. బీజేపీపై ఐక్యపోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం కేసు దోషులను తిరిగి జైలుకు పంపాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పు బీజేపీ, గుజరాత్ ప్రభుత్వ అక్రమాలను, పక్షపాత ధోరణిని బహిర్గతం చేసిందని చెప్పారు. ‘ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్పామన్న హామీతో మోదీ అధికారం చేపట్టారు. పదేళ్ల తర్వాత 20 కోట్లమందికి ఉద్యోగాలు వచ్చాయా అని చూస్తే ఒక్కటీ కనిపించడం లేదు. గౌతం అదానీ, ముఖేశ్ అంబానీ వంటి సంపన్నులకు మాత్రమే మోదీ పాలనలో లబ్ధి చేకూరింది’ అని రాజా విమర్శించారు.