ఏపీ సీఎం ప్రతిపాదనపై స్పందించిన రేవంత్రెడ్డి
6న హైదరాబాద్ ప్రజాభవన్లో భేటీకి ఆహ్వానం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. చర్చల ప్రతిపాదనను ఆహ్వానిస్తూ ఆయన మంగళవారం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నెల 6న హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా చర్చిద్దామని ఆహ్వానించారు. విభజన సమస్యలను కలిసి పరిష్కరించుకుందామని, తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖి చర్చలు అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని, మా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరపున చంద్రబాబును ఆహ్వానిస్తున్నామని రేవంత్రెడ్డి లేఖలో వెల్లడిరచారు. ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6న హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్రెడ్డికి చంద్రబాబు సోమవారం లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లవుతోంది. విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై అనేక దఫాలుగా చర్చలు జరిగినా, పరిష్కారం కాని అంశాలు ఇంకా ఉన్నాయి. వీటికి సామరస్యపూర్వక పరిష్కారం సాధించేందుకు కట్టుబడి ఉన్నాం. రెండు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి దోహదపడేలా ముఖ్యమైన చిక్కులను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖాముఖి చర్చల ద్వారా కీలక అంశాలను పరిష్కరించుకునేందుకు వీలుంటుంది. ఈ చర్చలు మంచి ఫలితాలిస్తాయనే నమ్మకం ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుస్థిర ప్రగతి సాధించడానికి, రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇది మన బాధ్యత. ప్రజల అభ్యున్నతికి దోహదపడేలా… ఉమ్మడి లక్ష్యాలు సాధించేందుకు ఇది కీలకం’ అని వివరించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రగతికి రేవంత్రెడ్డి చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు. దీనిపై రేవంత్రెడ్డి వెంటనే స్పందిస్తూ మంగళవారం చంద్రబాబుకు లేఖ రాశారు.
ఇకనైనా విభజన సమస్యలు కొలిక్కి వచ్చేనా ?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈనెల 6న హైదరాబాద్లో జరగనుంది. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్య కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్లోని తెలుగు అకాడమీ, అంబేడ్కర్, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలపైనా వివాదాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ అనేక సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యమైన చిక్కులను ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చొరవ చూపడంతో… రెండు రాష్ట్రాల మధ్య ఏళ్లు తరబడి పెండిరగులో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావొచ్చని రెండు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి. మరోవైపు రేవంత్రెడ్డికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈ ప్రాంత వాసుల్లో చర్చనీయాంశంగా ఉన్న ఖమ్మం జిల్లా భద్రాచలం విలీన గ్రామపంచాయతీలపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఏపీలో విలీనమైన ఏటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని కోరారు. ఈ అంశం కూడా రెండు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చ కొచ్చే అవకాశముంది.