3396 మద్యం షాపులకు 65,424 దరఖాస్తులు
రూ.1300 కోట్ల ఆదాయం… మరో రూ.200 కోట్ల ఆర్జన లక్ష్యం
నేడు మద్యం షాపుల టెండర్లకు తుది గడువు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. విదేశాల నుండి కూడా ఆన్ లైన్ లో దరఖాస్తులు అందుతున్నాయి. యూరప్, అమెరికా నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయి. అమెరికా నుండి దాదాపు 20 దరఖాస్తులు అందినట్లుగా ఎక్సైజ్శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి వెల్లడిరచారు. గురువారం రాత్రికి మొత్తం 65,424 దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం రెండు రోజుల సమయం పొడిగించిన ఫలితంగా మద్యం వ్యాపారంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతూ దరఖాస్తులు చేస్తున్నారు. రుసుము రూపంలో ఇప్పటికే రూ.1200 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. చివరి రోజైన శుక్రవారం భారీగా ధరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. నాన్ రిఫండబుల్ ఫీజు ద్వారా 1500 నుండి 1600 కోట్లు ఆదాయం రావాలన్న లక్ష్యంతో ఎక్సైజ్ శాఖ ఉంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఎక్జ్సైజ్ శాఖ తన లక్ష్యానికి చేరువలో ఉంది. మద్యం టెండర్లలో జోక్యం చేసుకుంటున్న నేతలను సీఎం చంద్రబాబు ఇప్పటికే హెచ్చరించారు. కూటమి నేతల జోక్యంతో కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తుల సంఖ్య తగ్గిందని… మీడియాలో పెద్ద ఎత్తున కధనాలు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నేతలు ఎవరైనా ఈ అంశంలో జోక్యం చేసుకుంటే కఠిన నిర్ణయాలు ఉంటాయని సంకేతాలు పంపింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేలా వ్యవహరించిన ఎమ్మెల్యేలకు చెక్ పడినట్లు అయింది. గత మూడు రోజులుగా టెండర్ల వెల్లువ మొదలైంది. తెలంగాణ సరిహద్దు గా ఉన్న వత్సవాయిలో 2 దుకాణాలకు అత్యధికంగా 200లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో ఎక్కువ పోటీ ఉన్నది ఈ రెండు దుకాణాలకేనని తెలుస్తోంది. ఇతర ప్రాంతాల్లో కూడా తెలంగాణ, కర్నాటక, తమిళనాడు సరిహద్దు జిల్లాల్లోని షాపులకు ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి.
చివరి రోజైన శుక్రవారం మరిన్ని దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 113 షాపులకు గాను 4,839 టెండర్లు దాఖలు కాగా… తర్వాత స్థానాల్లో ఏలూరు జిల్లా 144 షాపులకు గాను 4260 దరఖాస్తులు, విజయనగరం జిల్లాలో 153 షాపులకు 4,110 దరఖాస్తులు దాఖలయ్యాయి. తిరుపతి, పాకాల, సూళ్లూరుపేట, అనంతపురం జిల్లా పామిడి, బాపట్ల జిల్లా కొల్లూరు, చిత్తూరు జిల్లా సదుం, వైఎస్ఆర్ జిల్లా పెండిమర్రి మండలం, పల్నాడు జిల్లా వెల్దుర్తి తదితర ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి పది లోపుగా ధరఖాస్తులు దాఖలు కావడంతో అధికారులు వీటిపై దృష్టి పెట్టారు.