. రంగంలోకి సీఐడీ, ఎక్సైజ్ బృందాలు
. రాష్ట్రవ్యాప్తంగా డిస్టిలరీల్లో సోదాలు
. మద్యం నాణ్యతపై ఆరా… పత్రాల పరిశీలన
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: మద్యం తయారీ డిస్టిలరీలు, బేవరేజెస్ కంపెనీల్లో మంగళవారం ఏకకాలంలో సీఐడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మద్యం నాణ్యతను నిర్ధరించడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో వివిధ డిస్టిలరీల్లో ఉత్పత్తి చేసిన మద్యం విక్రయాలపైన, సీఐడీ బృందాలు ఆరా తీస్తున్నాయి. 2014
19 మధ్య కాలంలో టీడీపీ అనుమతులు ఇచ్చిన డిస్టిలరీలను అనేక మంది వైసీపీ నేతలు దక్కించుకున్నారన్న ఫిర్యాదులపైనా విచారించినట్లు సమాచారం. వాటికి సంబంధించిన రికార్డుల పరిశీలన, ఆధారాలపైనా సీఐడీ శోధిస్తోంది. కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో (2019`2024) తయారైన లిక్కర్ నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం సీఎం చంద్రబాబు ఆదేశాలతో రెండు నెలల క్రితం ఎక్సైజ్, సీఐడీతో కలిసి ఉమ్మడి కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ డిస్టిలరీల్లో తయారైన మద్యం నమూనాలను వీరు తనిఖీ పరిశీలించారు. వాటికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి చేరినట్లు తెలిసింది. చాలా చోట్ల సీఐడీ, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా సోదాలు చేపట్టారు. గతంలో కల్తీ మద్యంతో పెద్ద సంఖ్యలో మద్యం ప్రియులు చాలా మంది ఆస్పత్రులపాలవగా… మరికొందరు మృత్యువాత పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా నాసిరకం మద్యం లేకుండా, నాణ్యమైన మద్యమే అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మందు బాటిళ్ల యూనిట్ల ఉత్పత్తుల నిల్వ, దస్త్రాలను సీఐడీ అధికారులు పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో డిస్టిలరీల్లో అవకతవకలపై సీఐడీ అధికారులు ఆరా తీశారు.
తనిఖీల్లో భాగంగా మద్యం తయారీలో నిబంధనల మేరకు నాణ్యత పాటిస్తున్నారా ?, లేదా ?, అని సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏలూరు, వైఎస్ఆర్, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, చిత్తూరు, కృష్ణా తదితర జిల్లాల్లో సీఐడీ దాడులు కొనసాగాయి. ఏలూరు జిల్లాలోని పెదవేగి, ఉంగుటూరు మండలాల్లోని మద్యం డిస్టిలరీల్లో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టి… వాటి నిర్వహణ తీరును ఆరా తీశారు. ప్రధానంగా వివిధ చీప్లిక్కర్ తయారీ పరిశ్రమలకు వెళ్లి… తయారీ విధానాన్ని నిశితంగా పరిశీలించారు. ఉంగుటూరు మండలం చేబ్రోలులోని సోరింగ్ స్పిరిట్, పెదవేగి మండలం వంగూరులోని గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్కి చెందిన డిస్టిలరీలలో తనిఖీలు కొనసాగాయి. తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం సీఐడీ అదనపు ఎస్పీ ఆస్మాన్ ఫర్హీన్ అధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలోని సెంటినీ బయోటెక్ కర్మాగారంలోని మద్యం తయారీ బాటిలింగ్ యూనిట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సీఐడీ అధికారుల ఆదేశాల మేరకు కంచికచర్ల ఎక్సైజ్ అధికారులు బాటిలింగ్ యూనిట్లను పరిశీలించారు. గంపలగూడెం మండలం చింతలనర్వ వద్ద ఉన్న శార్వాణి మద్యం తయారీ కంపెనీ, కడప నగర శివారు ఈగల్ డిస్టిలరీలో సీఐడీ, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా సోదాలు చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం గొడవర్రు బివీఎస్ డిస్టిలరీ, దావులూరులోని బీఆర్కే స్పిరిట్స్ ఫ్యాక్టరీల్లో అధికారుల బృందాలుగా ఏర్పడి రికార్డులను పరిశీలించారు. నంద్యాల ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ సమీపంలో మద్యం తయారీ పరిశ్రమ బాటిలింగ్ యూనిట్లకూ సీఐడీ బృందాలు వెళ్లాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ లిక్కర్ పరిశ్రమలోను సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. సీఐడీ డీఎస్పీ నాగేంద్ర భూపాల్ అధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది, సీఐడీ సిబ్బంది కలిసి రికార్డులను తనిఖీ చేశారు. రంగంపేట మండలం కోటపాడులోని పీఎంకే డిస్టిలరీ, నల్లమిల్లిలోనూ ఫ్రాగ్ మద్యం తయారీ పరిశ్రమ, ప్రకాశంజిల్లా పాత సింగరాయకొండ పరిధిలో ఫెరల్ డిస్టలరీలను సీఐడీ అధికారులు తనిఖీ చేశారు. సోదాల్లో భాగంగా గత ఏడాది నుంచి ఎంత మద్యం తయారు చేశారు? ఎన్ని వేల లీటర్ల మద్యాన్ని విక్రయించారన్న వివరాలపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఐదుగురు చొప్పున సీఐడీ అధికారుల బృందం దస్త్రాలను పరిశీలిస్తుండగా… సిబ్బంది ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. సీఐడీ సోదాలు ఉదయం నుంచి కొనసాగాయి.