వైసీపీ పాలన పీడకల
కుప్పం అభివృద్ధికి ప్రత్యేక కృషి
ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాలాంధ్ర -చిత్తూరు: రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేయడంతో పాటు పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారిగా ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కుప్పం లో పర్యటించారు. ఈ సందర్భంగా కుప్పం బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ… మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని, ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. తన రాజకీయ జీవితంలో తొమ్మిది పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచానని, ఇందులో ఎనిమిది సార్లు కుప్పం వాసులే ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. ఈ ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి తిరుగులేని విజయాన్ని అందించారని చెబుతూ… రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగ రాయబోతున్నామని తెలిపారు. ఎన్నికల్లో కూడా యువత, మహిళలు, బలహీనవర్గాలకు అవకాశం ఇవ్వడం జరిగిందని… రాష్ట్ర మంత్రివర్గంలో ఎనిమిది మంది బీసీలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో కుప్పంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టేలా కృషి చేస్తానన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం కావడంతోపాటు ఖజానా ఖాళీ అయిందని చంద్రబాబు తెలిపారు. అమరావతి, మద్యం పాలసీ, పోలవరం, భూగర్భ ఖనిజాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఒకటో తేదీన నేరుగా లబ్ధిదారులకు అందివ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం పోలవరాన్ని, అమరావతిని సందర్శించడం జరిగిందని… ఇకనుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్న ఆశయంతో కుప్పం ప్రజలే నాకు ప్రత్యక్ష దేవుళ్లుగా భావించి ముందుగా ఇక్కడకు వచ్చానని చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అన్ని విధాలుగా వెనకబడిపోయిందని, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్రంలో పోలవరంతోపాటు పెండిరగ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాల్సి ఉందన్నారు. శ్రీశైలం నుంచి కుప్పానికి సాగనీరు అందించాలన్న సంకల్పంతో హంద్రీనీవా కాలువ పనులు గతంలో 90 శాతం పూర్తి చేస్తే ఐదేళ్ల వైసీపీ పాలనలో 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ఈ విషయంలో కుప్పం వాసులను సినిమా సెట్టింగులతో వైసీపీ ప్రభుత్వం మోసిగించే ప్రయత్నం చేసిందన్నారు. ఏడాదిలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీరు అందిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల హామీ మేరకు డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ కి చర్యలు చేపట్టామన్నారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనే దిశగా ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆకలి తీర్చడానికి 283 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర సంక్షేమానికి ఎంత కష్టమైనా భరిస్తామన్నారు. కుప్పం ద్రావిడ యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తామన్నారు. కుప్పం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు.