. మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు
. 3,396 షాపులకు 87,116 వేల టెండర్లు
. అంచనాలకు మించి ఖజానాకు రూ.1,750 కోట్ల ఆదాయం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర ప్రభుత్వానికి దసరా కానుకగా ఎక్సైజ్ శాఖ కాసుల వర్షం కురిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించింది. కొన్ని ప్రాంతాల్లో మినహా కుప్పలు తెప్పలుగా టెండర్లు దాఖలు చేశారు. దాదాపు 87,116 వేల దరఖాస్తులు రావడంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.1,750 కోట్ల మేర ఆదాయం లభించింది. షాపుకు రూ.2 లక్షల చొప్పున టెండరు రుసుం చెల్లించాల్సి ఉండగా, ఈ మొత్తం ప్రభుత్వ ఖజానాకు ఆదాయంగా సమకూరనుంది. అంటే కేవలం మద్యం షాపులకు టెండరు రుసుం ద్వారానే రూ.1,750 కోట్ల ఆదాయం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్ల ఆదాయ వస్తుందని అంచనా వేయగా, దానికి మించి షాపులకు టెండర్లు దాఖలయ్యాయి. తొలుత ఈనెల 9వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. కానీ అనుకున్న మేర దరఖాస్తులు దాఖలు కాకపోవడంతో రెండు రోజులు పొడిగించారు. దానిప్రకారం మద్యం దుకాణాల లైసెన్స్లకు సంబంధించి దరఖాస్తు గడువు శుక్రవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. ఈ ఒక్కరోజే రికార్డు స్థాయిలో దాదాపు 22 వేల దరఖాస్తులు ఆఫ్లైన్, ఆన్లైన్లలో వచ్చాయి. దీంతో మొత్తం మద్యం దుకాణాల కోసం దాదాపు 87 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1,750 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ రాత్రి 12 గంటల్లోపు ధరావత్తు సొమ్ము చెల్లించేందుకు అబ్కారీ శాఖ అవకాశం కల్పించింది. రాష్ట్రంలో అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 113 షాపులకు 5,764 దరఖాస్తులు రాగా, ఆ తర్వాత 5 వేలకు పైగా వచ్చిన జిల్లాల్లో ఏలూరు 5,339, పశ్చిమ గోదావరి 5,362, విజయనగరం 5,235 జిల్లాలున్నాయి. మద్యం సిండికేట్లను భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని షాపులకు పరిమితంగానే దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించిన ఎక్సైజ్ శాఖ, ఈ నెల 14న లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించనుంది. అక్టోబరు 15 నాటికి దుకాణాలను లాటరీలో దక్కించుకున్న ప్రైవేటు వారికి అబ్కారీ శాఖ అప్పగించనుంది. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. ఇక జిల్లాల వారీ మద్యం షాపుల సంఖ్యను బట్టి వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.