వయనాడ్: కేరళ ఉపపోరుకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సిద్ధమని ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నిక కోసం ఎల్డీఎఫ్ అభ్యర్థిగా సత్యన్ మొకేరి పేరును శుక్రవారం ప్రకటించారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకేరి అభ్యర్థిత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం ఆమోదించినట్లు తెలిపారు. ఆయన పేరును కేరళ రాష్ట్ర సమితి ప్రతిపాదించిందని రాజా వెల్లడిరచారు. కాగా, సత్యన్ మొకేరి ఏఐఎస్ఎఫ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. కాలికట్ యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, కార్యదర్శిగా, జాతీయ సమితి ఉపాధ్యక్షుడిగా, కోజికోడ్ జిల్లా అధ్యక్షుడిగా, ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. వయనాడ్ చరిత్రలో ఎల్డీఎఫ్ అభ్యర్థిగా అత్యధిక ఓట్లు సాధించిన ఘనత సత్యన్ మొకేరి సొంతం. 1987 నుంచి ఆయన మూడు సార్లు నాదాపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తిరువనంతపురంలో జరిగిన రాష్ట్ర సమితి సమావేశంలో సత్యన్ మొకేరి అభ్యర్థిత్వం ఖరారైంది. సమావేశంలో సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి వినయ్ విశ్వం పాల్గొన్నారు.