. మాది దేశ ముఖచరిత్ర మార్చే మేనిఫెస్టో
. దేశవ్యాప్తంగా రైతులకు రుణ మాఫీ చేస్తాం
. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం
. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ రావాలి
. డబ్బులు ఇచ్చుకో… దేశాన్ని దోచుకో ఇదే బీజేపీ పాలన
. తుక్కుగూడ జనజాతర సభలో రాహుల్ గాంధీ
విశాలాంధ్ర – హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో దేశ ముఖ చరిత్రను మార్చే మేనిఫెస్టో అని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇది మీ మాటలు, బాధలు విని తయారు చేసిన మేనిఫెస్టో అని, ప్రజలు, యువత మేనిఫెస్టోను క్షుణ్ణంగా చదివితే మీకు దాని ప్రాముఖ్యత అర్థం అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ హామీలు ఇస్తే దానిని మేము నిలబెట్టుకుంటామన్న విషయం తెలంగాణలో రుజువైందని, అలాగే దేశంలో కూడా నిలబెట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. శనివారం తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన జనజాతర సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షత వహించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. తొలుత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు మీతో ఉన్న సంబంధం రాజకీయ సంబంధం కాదని, కుటుంబ, ప్రేమ, అప్యాయతల బంధం అని అన్నారు. సోనియాగాంధీ మీ వెంట ఇంతకాలం ఎలా ఉన్నారో, అలాగే నేను కూడా మీ వెంట ఉంటానని హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించిందన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాలకు న్యాయం చేసేందుకు పెద్దపీట వేస్తూ దీనిని తయారు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విధంగానే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలను ఇస్తుందన్నారు. అందులో యువతకు, మహిళలకు, రైతులకు, కార్మికులకు, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా గడిచిన పదేళ్ల కాలంలో దేశంలో మోదీ ప్రభుత్వం యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగ శాతం తారస్థాయికి చేరుకుందన్నారు. ఎన్నికల ముందు ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు పెద్ద పీట వేస్తుందని హామీ ఇచ్చారు. నారీ న్యాయం క్రింద కుటుంబంలో ఒక మహిళకు సంవత్సరానికి రూ.లక్ష అందిస్తామన్నారు. ఇది దేశంలోనే విప్లవాత్మక మార్పు తీసుకువస్తుందని చెప్పారు. దేశంలో ప్రతి రోజూ 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ అతిపెద్ద ధనవంతుల రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారో కానీ రైతులకు ఒక్క రూపాయి రుణాన్ని కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా రుణమాఫీ చేయడంతో పాటు పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి పంట ఉత్పత్తికి న్యాయమైన ధరతో పాటు స్వామినాథన్ కమిటీ సూచనల ప్రకారం దీనిని అమలు చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే కార్మికులకు రూ.400 కనీస వేతనం ప్రకటించబోతున్నామన్నారు. దేశంలో 50 శాతం మంది వెనుకబడిన జనాభా, 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, 15 శాతం మైనార్టీలు, 5 శాతం నిరుపేదలు ఇతరులు ఉన్నారని వివరించారు. దీని ప్రకారం దేశంలో 90 శాతం జనాభా అణగారిన జనాభా ఉందన్నారు. ఈ జనాభాలో ఎవ్వరూ కూడా అటు ప్రభుత్వ రంగ సంస్థల్లో లేదా పెద్ద పెద్ద ప్రైవేటు సంస్థల్లో కనబడరని అన్నారు. చివరకు మీడియా సంస్థల్లో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కనబడరని, పెద్ద కంపెనీల జాబితాలో కూడా వెనుకబడిన తరగతుల వారు కనిపించరని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే అధికారుల్లో కేవలం మూడు శాతం మాత్రమే అణగారిన వర్గాల వారు ఉన్నారన్నారు. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో వంద రూపాయల్లో కేవలం ఆరు రూపాయలే వాళ్ల కోసం ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలో చేసిన విధంగానే దేశ వ్యాప్తంగా కుల గణన చేయబోతున్నామని తెలిపారు. ఆర్థిక, వ్యవస్థాపక సర్వేలు చేస్తామని, దీని వల్ల దేశ ధనం ఎవ్వరి చేతుల్లో ఉందనే విషయం బయటపడుతుందని, దాని తరువాత చాలా విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికార వ్యవస్థ దుర్వినియోగం
అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికార వ్యవస్థను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా నడిపించిందో చూశామని, ఫోన్లు ట్యాప్ చేశారు… ఇంటలిజెన్స్ ఏజెన్సీలను, పోలీసులను, దుర్వినియోగం చేసి కేసీఆర్ తన స్వార్థం కోసం వాడుకున్నారని మండిపడ్డారు. అధికారం కోల్పోయిన వెంటనే ఆ ట్యాపింగ్ సమాచారాన్ని ధ్వంసం చేశారని అన్నారు. మనల్ని భయపెట్టి, బెదిరించి డబ్బులు దండుకుని ప్రభుత్వాని నడిపించారని, కానీ నేడు తెలంగాణలో విచారణ ప్రారంభించడం ద్వారా నిజాలను వెలికితీసి ప్రజలకు తెలియజేస్తోందని తెలిపారు. ఇక్కడ కేసీఆర్ ఎలా పని చేశారో, అక్కడ మోదీ కూడా అలాగే పనిచేస్తున్నారని చెప్పారు. దేశంలో ఈడీ కాస్తా వేధింపుల శాఖగా మారిందని, దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం, మంత్రులు బీజేపీలో ఉన్నారని విమర్శించారు. ఎన్నికల కమిషన్లో కూడా మోదీ తొత్తులు ఉన్నారన్నారు. దేశంలో ఎన్నికల బాండ్ల కుంభకోణం జరిగిందన్నారు. డబ్బులు ఇవ్వు… దేశాన్ని దోచుకో అన్న చందంగా బీజేపీ పాలన సాగుతోందని మండిపడ్డారు. మొదటి రోజు సీబీఐ కంపెనీలను బెదిరిస్తుంది… అదే నెలలో బీజేపీకి ఆ కంపెనీ చందాలు ఇస్తుంది. అలాగే కంపెనీలకు ప్రభుత్వం పెద్ద కంట్రాక్టలకు ఇస్తారు,…. వారి నుండి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బులు బీజేపీ పార్టీ ఖాతాలో జమ అవుతాయి. ఇపుడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మా అకౌంట్లను ఫ్రీజ్ చేశారని, కానీ తాము భయపడేది లేదన్నారు. తెలంగాణాలో బీజేపీ, బీఆర్ఎస్ను ఓడిరచామని, దేశంలో బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగం అన్ని వర్గాలకు రక్షణ కల్పిస్తుందని, కానీ బీజేపీ అలాంటి రాజ్యాంగాన్నే రద్దు చేయాలనే ప్రయత్నం చేస్తోందని, దానిని తాము అడ్డుకుంటామని తెలిపారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు చేసే పోరాటమన్నారు. కేవలం దేశంలోని మూడు, నాలుగు శాతం మంది కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోందని, మీడియా, ధనవంతులు మద్దతుగా ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దగ్గర నిజాయితీ, ప్రజల ప్రేమ ఉందని, చివరకు అదే గెలుస్తుందని అన్నారు.