. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి కోట్లు మింగేశారు
. బదిలీల సిఫార్సులకు లక్షల్లో రేటు
. విలువైన భూముల వశానికి విశ్వప్రయత్నం
. లిక్కర్ సిండ్కేట్తో బెదిరింపు చర్యలు
. కండిషన్తో నెలవారీ ముడుపులకు హుకుం
. విశాఖ నగరంలో ఎమ్మెల్యేల హల్చల్
అధికారంలోకి వచ్చి 100 రోజులు గడవక ముందు నుంచే అధికార పార్టీ ఎమ్మెల్యేలు సొంత సంపాదనే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజాసమస్యలు గాలికొదిలేశారు. ప్రతి పనిలోనూ వాటా ఫిక్స్ చేసి ఉత్తరాంధ్రకు తలమానికమైన విశాఖలో తమదైన రీతిలో అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఐదేళ్లు వేచి ఉన్న నేతలు… ప్రజాప్రతినిధులుగా గెలిచిన వెంటనే ఆకలిగొన్న పులిలా అందిందంతా దోచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తొలుత ఉచిత ఇసుక కృత్రిమ కొరత సృష్టించి కోట్లలో దోచేశారు. ఆనక సిఫార్సు లేఖలకు లక్షల్లో రేటుకట్టి సీఐ, తహసీల్దార్ల బదిలీల్లో చక్రం తిప్పారు. విలువైన భూములపై కన్నేశారు. నేడు లిక్కర్ సిండికేట్ నిర్వహిస్తూ వేరెవరైనా దరఖాస్తు వేస్తే బెదిరింపు చర్యలకు దిగుతున్నట్టు ఆరోపణలు హల్చల్ చేస్తున్నాయి. వాటా కండిషన్ పెట్టిమరీ నెలవారీ ముడుపులు ఇవ్వాలని హుకుం జారీచేసినట్టు తెలుస్తోంది.
విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెత కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచింది. కొందరు ఎమ్మెల్యేలు బరితెగించి ప్రతి పనిలోనూ వాటా కావాలంటూ నియోజకవర్గంలో తమ సొంత సామ్రాజ్యాన్ని అమలు చేస్తున్నారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నేతలు… ఎమ్మెల్యేలుగా అధికారం వచ్చి రాగానే అడ్డదారులు తొక్కుతున్నారు. ఉచిత ఇసుక ప్రకటన రాకముందే ఇసుక అంతా తమ ఆధీనంలోకి తెచ్చుకొని, అక్రమ నిల్వ చేసుకుని, కృత్రిమ కొరత సృష్టించి రూ.కోట్లలో సంపాదించుకున్న కొంతమంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు మద్యం దుకాణాలూ మావే అంటూ ఎమ్మెల్యేల పెత్తనంపై కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో పోస్టింగులకు ఓ రేటు పెట్టి సిఫార్సు లేఖలు కొంతమంది ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో ఇచ్చేశారు. విశాఖలో కొంతమంది ఎమ్మెల్యేలు బరితెగించి ఐదేళ్లు తమ హవాకు హద్దే లేదంటూ అన్ని వనరులు సమకూర్చుకుంటున్నారు. దీంతో అనేకమంది ఎమ్మెల్యేల పై భారీ వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సీిఐలు, తహసీల్దార్ల బదిలీల్లో విశాఖలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పారు. జనసేన నుంచి నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే అధికారుల బదిలీల సిఫార్సు లేఖలు ఇవ్వడంలో అగ్రస్థానంలో ఉన్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారుల బదిలీల్లో కూడా మరో ఎమ్మెల్యే చక్రం తిప్పారు. సిఫార్సు లేఖ కు రూ.ఐదు లక్షల నుంచి పది లక్షలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. జీవీఎంసీలో కీలక పోస్టులకు రూ.20 లక్షల కూడా ఇచ్చినట్లు ప్రచారం. ఇక నియోజకవర్గంలో అధికారులు నేను చెప్పినట్లే నడవాలి, లేకుంటే వేటు తప్పదు అన్నట్లు కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. విశాఖలో విలువైన భూములు, ఆస్తులు తమ వశం చేసుకునేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు ఆరాటపడుతున్నారు. ఇదే మంచి అవకాశం, మళ్లీ రాదు అంటూ మరి కొంతమంది హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. ఐదేళ్లు వైసీపీ నేతలు అడ్డగోలుగా సంపాదించలేదా.. మేము సంపాదించుకోవద్దా… అంటూ బహిరంగంగానే అధికారులతో వాదోపవాదనులకు దిగుతున్నారు. విశాఖలో లిక్కర్ సిండికేట్ అంతా ఓ టీడీపీ ఎమ్మెల్యే నడుపుతుండగా, తాజాగా మరో ఎమ్మెల్యే ఆ సిండికేట్ వ్యవహారంలో తల దూర్చారు. ఎక్సైజ్ శాఖలో ఇటీవల ఉన్నతాధికారుల తోపాటు సీఐలు, ఎస్ఐల పోస్టింగుల్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పెత్తనమే అధికంగా కనిపించింది. విశాఖ జిల్లాలో 155 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రేపటితో దరఖాస్తులకు గడువు ముగియనుంది. నగరంలో భారీ డిమాండ్ కలిగిన 50 మద్యం దుకాణాలకు ఎమ్మెల్యేలంతా తమ అనుచరుగణంతో తీవ్ర పోటీ పడుతున్నారు. మద్యం షాపులపై ఎమ్మెల్యే పెత్తనం తీవ్రంగానే ఉంది. వారి అనుచరులు సిండికేట్లతోనే దరఖాస్తులు పెట్టించారు.
వేరే ఎవరైనా వేస్తే వారిపై బెదిరింపు చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తుంది. లాటరీలో షాప్ వస్తే వ్యాపారం చేయలేరని ఓ ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నట్లు మరి కొంతమంది వాపోతున్నారు. మరికొన్నిచోట్ల వాటా కండిషన్ పెట్టి నెలవారి ముడుపులు ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. మొత్తానికి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులైన కొంతమంది తమ సొంత సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆ నియోజకవర్గంలో ప్రజల్లో వ్యతిరేకత అధికంగానే కనిపిస్తుంది. దందాలు చేస్తున్న ఆ ఎమ్మెల్యేలపై అధిష్ఠానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.