. ఐదేళ్ల తర్వాత మళ్లీ నిర్మాణ పనుల్లో కదలిక
. 1,575 ఎకరాల్లో ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణం
. బహిరంగ నోటిఫికేషన్ విడుదల చేసిన సీఆర్డీఏ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఐదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత అమరావతి రాజధాని నిర్మాణపనుల్లో మళ్లీ కదలిక ప్రారంభమైంది. ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణానికి సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇక రాజధాని పనులు ఊపందుకోనున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతో జరుగుతున్న రాజధాని నిర్మాణపనులన్నింటినీ అర్ధాంతరంగా నిలిపివేశారు. 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తూ పనులన్నీ ఆపేయాలని ఆదేశించారు. ఆ తర్వాత డిసెంబర్లో రాష్ట్ర సమగ్రాభివృద్ధి పేరుతో శాసనసభలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారు. దానిపై రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు రోడ్డెక్కారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు వారు నాలుగున్నర సంవత్సరాలపాటు అవిశ్రాంతంగా పోరాడారు. రాజధాని ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం అనేక రూపాల్లో ప్రయత్నించింది. రైతులపై వేలాది అక్రమ కేసులు బనాయించింది. వారు చేసే నిరవధిక దీక్షలకు పోటీగా మూడు రాజధానులకు అనుకూలంగా పోటీ దీక్షలు నిర్వహించింది. ముఖ్యమంత్రి రైతుల ఆందోళనల ఫలితంగా సచివాలయానికి రావడం మానేశారు. ఆయన నివాసాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకుని అన్ని శాఖల సమీక్షలు అక్కడే నిర్వహించారు. మంత్రి వర్గ సమావేశానికి, అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే సచివాలయానికి వచ్చేవారు. ముఖ్యమంత్రి రాకపోవడంతో సహజంగానే మంత్రులు సైతం సచివాలయానికి మొక్కుబడిగానే వచ్చేవారు. దీంతో ప్రజల తాకిడి తగ్గి సచివాలయం వెలవెలబోయింది. రాజధాని ప్రాంత రహదారులు చెట్లు, కంపలు పెరిగి అధ్వానంగా తయారయ్యాయి. చివరకు వీధి లైట్లు కూడా వెలిగేవి కావు. రాజధాని ప్రాంతంలో అన్ని రకాల వ్యాపారాలు దివాలా తీశాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి మళ్లీ కళ వచ్చింది. సీఆర్డీఏ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికే రాజధాని ప్రాంతంలోని రహదారులు, వీధిలైట్లు వంటి వాటికి మరమ్మతులు చేపట్టారు. సచివాలయానికి ముఖ్యమంత్రి రోజూ వస్తున్నారు. మంత్రులంతా రావాలని ఆదేశించారు. దీంతో వారంతా హాజరవుతూ తమ ఛాంబర్లలో ఆశీనులవుతున్నారు. సీఎం, మంత్రులు సచివాలయంలో తిష్ట వేస్తుండడంతో సహజంగానే అధికారులంతా విధులకు విధిగా హాజరవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇక పార్టీ శ్రేణులు, ప్రజల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. మరోవైపు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు తర్వాత రెండో పర్యటన అమరావతి రాజధానిలో పర్యటించారు. గత ఐదేళ్లలో అమరావతిలో జరిగిన విధ్వంసాన్ని, ఆగిన రహదారులు, భవనాల నిర్మాణపనులు పరిశీలించారు. అనంతరం మున్సిపల్ మంత్రి నారాయణతో కలిసి గతంలో నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కబురు పెట్టి వారితో సమావేశమయ్యారు. ఇప్పటివరకు జరిగిన పనులు, జరగాల్సిన పనులపై సమీక్ష చేశారు. అప్పటికే ఒకసారి అమరావతిని చుట్టి వచ్చిన చంద్రబాబు పనులు వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సీఆర్డీఏ అధికారులు చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా రాజధాని అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నోటిఫై చేస్తూ సీఆర్డీఏ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలకు 1575 ఎకరాల ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది. జోనింగ్ నిబంధనల ప్రకారం ఈ భూమిని నోటిఫై చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. సీఆర్డీఏ చట్టం సెక్షన్-39 ప్రకారం ఈ బహిరంగ ప్రకటన జారీ చేసింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వ కాంప్లెక్సు భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్టు సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
రియల్టర్ల హడావుడి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో భూములకు రెక్కలొచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల హడావుడి పెరిగింది. గతంలో గజం రూ.20 వేలు పలికిన స్థలం ఇప్పుడు రూ.50 వేలు దాటిందంటే పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే మరీ అత్యవసరమైతే తప్ప రాజధాని ప్రాంత భూముల యజమానులు అమ్మకాలకు ముందుకు రావడం లేదు. కొనుగోలుదారులు మాత్రం రైతులు ఏ రేటు చెప్పినా, తర్వాత ఇంకా రేట్లు పెరిగే ప్రమాదం ఉందని ముందడుగు వేస్తున్నారు. ఫలితంగా రోజురోజుకూ అమరావతి రాజధాని ప్రాంతంలో పొలాలు, స్థలాలు, ఇళ్లు, అపార్ట్మెంట్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంకోవైపు ఇంటి అద్దెల్లో కూడా పెరుగుదల ప్రారంభమైంది. వ్యాపారాలు జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం సీఆర్డీఏ ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల నిర్మాణానికి ఇచ్చిన నోటిఫికేషన్తో వ్యాపారాలు మరింత ఊపందుకోనున్నాయి.