రాజధాని నిర్మాణ భాగస్వామ్య కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గతంలో రాజధాని నిర్మాణ పనుల్లో భాగస్వాములైన కంపెనీల ప్రతినిధులతో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. టెండర్ల కాలపరిమితి ముగియడంతో నిలిచిన పనులు కొనసాగించే విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ఆయా కంపెనీలతో చర్చించారు. సమావేశంలో మున్సిపల్ శాఖమంత్రి నారాయణ, సీఆర్డీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో జరుగుతున్న నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపివేసింది. దీంతో కాంట్రాక్ట్ కంపెనీలు నిర్మాణం కోసం తీసుకొచ్చిన పరికరాలను ఇక్కడ నుంచి తరలించేశాయి. 40 నుంచి 90 శాతం వరకు పూర్తయిన భవనాలు ముళ్లపొదలతో నిండిపోయాయి. మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. సచివాలయం కూడా జన సంచారం లేక కళ తప్పింది. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నివాసాన్నే క్యాంపు కార్యాలయంగా మార్పు చేసి, శాఖా సమావేశాల సమీక్షలు సైతం అక్కడే నిర్వహించారు. మంత్రివర్గ సమావేశానికి, శాసనసభా సమావేశాల సమయంలో తప్ప సచివాలయానికి రాలేదు. దీంతో మంత్రులు కూడా సచివాలయానికి రావడం మానేశారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి ఉచితంగా భూములిచ్చిన రైతుల ఆందోళనలు, వీరికి వ్యతిరేకంగా మూడు రాజధానులను సమర్థిస్తూ అధికారపక్ష నేతల మద్దతుతో సాగిన పోటీ దీక్షలతో అమరావతి రాజధాని పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో రాజధాని ప్రాంతంలో వెలుగులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చంద్రబాబు ఒకసారి రాజధాని ప్రాంతంలో పర్యటించి ఆగిపోయిన నిర్మాణ పనులను పరిశీలించారు. వారం వ్యవధిలోనే నిర్మాణ రంగ కంపెనీలతో సీఎం భేటీ కావడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.