నూపుర్ శర్మ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్తపౖౖె చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హౌరాలో జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీజేపీ చేసిన పాపానికి ప్రజలెందుకు ఇబ్బందులు పడాలని మమత బెనర్జీ శనివారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. తాను ఈ విషయాన్ని ఇంతకు ముందే చెప్పానన్నారు. హౌరాలో జరుగుతున్నదాని వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. అల్లర్లు జరగాలని ఆ పార్టీలు కోరుకుంటున్నాయని, అటువంటిదానిని తాము సహించబోమని చెప్పారు. అలాంటివారందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హౌరాలోని జాతీయ రహదారిపై రెండు రోజుల నుంచి జరుగుతున్న నిరసనల నేపథ్యంలో పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 144 నిబంధనలను అమలు చేస్తున్నారు. ఉలుబెరియా సబ్ డివిజన్, హౌరా పరిధిలోని జాతీయ రహదారి, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో ఈ నిబంధనలు జూన్ 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాల్లో శుక్రవారం హింసాత్మక సంఘటనలు జరిగాయి.