. ఐక్యంగా పనిచేయండి
. కాంగ్రెస్ నేతలకు రాహుల్ దిశానిర్దేశం
న్యూదిల్లీ : త్వరలో జరగబోయే మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభ ఎన్నికల్లో విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అంతర్గత విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పని చేయాలని సూచించారని చెప్పాయి. త్వరలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, మిత్ర పక్షాలతో కలిసి ఎన్నికల్లో పని చేయాలని రాహుల్గాంధీ… కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, రాహుల్ గాంధీ ఇటీవల సమీక్షించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు విషయమై రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం… మూడు రాష్ట్రాల స్థానిక నేతలు, జమ్మూకశ్మీర్ నేతలు వ్యూహాలకు అనుగుణంగా ముందుకు సాగాలని రాహుల్గాంధీ సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర నేతలకు హై కమాండ్ దిశానిర్దేశం చేస్తోందని రాహుల్ అన్నారు. బహిరంగంగా ఒకరినొకరు తిట్టుకోవడం మానుకోవాలని ఆయన కోరారు. పార్టీలో అన్ని సమస్యలపై చర్చిస్తామని త్వరలో జరగనున్న ఎన్నికలు కాంగ్రెస్కు చాలా మంచి అవకాశమని, ఐక్యంగా ముందుకుసాగితే సానుకూల ఫలితాలు వస్తాయని రాహుల్ అన్నారు. మరోవైపు పార్టీలో అంతర్గత పోరుపై ఖడ్గే కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వర్గానికి చెందిన వ్యక్తి తన వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని, మరో వర్గం నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయని ఖడ్గే అన్నారు. పార్టీ పదవులను భర్తీ చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారని, కానీ కొంతకాలం మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే కొనసాగుతారని ఖడ్గే స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు మొత్తం ఏకం కావాలని మహారాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శి ఆశిష్ దువా తెలిపారు.