. రాష్ట్రానికి అవసరమైనవి రాబట్టాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర-విశాఖ: ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరించుకునేందుకు కేంద్రంలో అనుకూల పరిస్థితి ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి టీడీపీ, వైసీపీ ఎంపీల మద్దతు అవసరమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర సమస్యలను పరిష్కారించాలని, రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కూడా ఇందుకు ప్రయత్నించాలని రామకృష్ణ కోరారు. విశాఖ మురళీనగర్లోని ఆహ్వాన ఫంక్షన్ హాల్లో రెండు రోజులుగా జరుగుతున్న సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ మోదీ పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రస్తుత పరిస్థితులను సానుకూలంగా మార్చుకుని ఏపీకి అవసరమైనవన్నీ రాబట్టాలన్నారు. పదేళ్ల పాటు అబద్ధాలు చెబుతూ పరిపాలన సాగించిన మోదీకి, ప్రజాస్వామ్యం గొంతు నొక్కి పోలీసు రాజ్యాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డికి తాజా ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని రామకృష్ణ అన్నారు. ఇచ్చిన హామీల అమలులో కేంద్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, సొంతంగా అధికారాన్ని చేపట్టలేక ఒంటెద్దు పోకడలతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని విమర్శించారు. ఏకపక్షంగా కొత్త నేర చట్టాలను అమల్లోకి తెచ్చిందని, ప్రతిపక్షాల అభ్యంతరాలను నిర్లక్ష్యం చేసిందని వ్యాఖ్యానించారు. ప్రోటెం స్పీకర్, స్పీకర్ ఎన్నికలప్పుడూ నిబంధలను పట్టించుకోలేదని, డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీ కాగా దానిని కాలదన్నే రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని రామకృష్ణ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ వైఖరి మారలేదన్నారు. ఉక్కు కర్మాగారాన్ని నష్టాల్లోకి నెట్టి దానిని అమ్మేయాలని చూస్తోందని విమర్శించారు. జగన్ అధికారంలో ఉండాలా? వద్దా? అన్నదే అజెండాగా ఎన్నికలు జరిగాయని, మిగతాంశాలను పట్టించుకోలేదని గుర్తుచేశారు. ఎన్నికల వ్యవస్థపై దేశవ్యాప్త చర్చ అవసరమని రామకృష్ణ నొక్కిచెప్పారు. ఈవీఎంలపై ప్రత్యేక చర్చ జరగాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలను వాడటం లేదని ఆయనన్నారు. తాజా ఎన్నికల్లో ప్రధాన పార్టీలు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాయని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం పోతుందని రామకృష్ణ హెచ్చరించారు. సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు పాల్గొన్నారు.