39,259కు చేరిక… నేటితో తెర
పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో అధికం
ఇతర రాష్ట్రాల వారికీ అవకాశం… 11న లాటరీ ద్వారా ఎంపిక
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు టెండర్లు ఊపందుకున్నాయి. ఈనెల 9వ తేదీ బుధవారం నాటితో టెండర్ల గడువు ముగియనుంది. ఈనెల 1వ తేదీన మద్యం టెండర్లు ప్రారంభమయ్యాయి. మొదటగా మందకొడిగా సాగినప్పటికీ… మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 3,396 దుకాణాలకుగాను 39,259 దరఖాస్తులు పోటెత్తాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 2,658, ఏలూరు జిల్లాలో 2,633, విజయనగరం జిల్లాలో 2,575, శ్రీకాకుళం జిల్లాలో 2082, గుంటూరు జిల్లాలో 2,188, తూర్పు గోదావరిలో 2,071 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాలో 1,828, అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 423 మంది దరఖాస్తు చేశారు. ప్రారంభంలో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని, దీనికి కారణం కేవలం రాజకీయ నేతలు సిండికేట్గా మారి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారన్న విమర్శలున్నాయి. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి మద్యం దుకాణం దరఖాస్తుకు రూ.2 లక్షల ఫీజు (నాన్`రిఫండ్బుల్) పెట్టగా… ఎన్ని దరఖాస్తులు వస్తే, ప్రభుత్వానికి అంతగా లాభం చేకూరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష వరకు దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేశారు. టెండర్లలో పెద్దఎత్తున నియోజకవర్గ ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల జోక్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడే పరిస్థితులున్నాయి. అధికార కూటమి నేతలు, ప్రతిపక్ష వైసీపీ నేతలు కలుపుకుని టెండర్లకు అడ్డంకులు సృష్టించడంతో ఈ పరిస్థితి ఎదురైందన్న విమర్శలున్నాయి. లాటరీలో ఒక్క మద్యం దుకాణం దక్కినా చాలన్న భావనతో ఎక్కడికక్కడే దరఖాస్తులకు క్యూ కడుతున్నారు. అవకాశం దక్కించుకోవడానికి రాజకీయ నాయకుల నుంచి దళారుల వరకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో పార్టీ ఎమ్మెల్యేలు, నేతల జోక్యం వద్దని ఆదేశించినట్లు తెలిసింది. ఆన్ లైన్ ద్వారా మద్యం టెండర్లను స్వీకరించడంతో కొంత చెక్పడినట్లయింది. ఈనెల 7 నుంచి దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. చివరి తేదీ నాటికి దరఖాస్తుల సంఖ్య పెరగనుంది. మద్యం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని అధికార పార్టీ నేతలే తగ్గిస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం టెండర్లలో కూటమి ఎమ్మెల్యేల అక్రమ దందా వల్లపూర్తి స్థాయిలో దరఖాస్తులు దాఖలు కాకపోవడంతో ప్రభుత్వం రూ.2,500 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయాలను పక్కనబెట్టి, సిండికేట్గా మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు సిద్ధమయ్యారు.
మద్యం దుకాణాల లాటరీలో ఇతర రాష్ట్రాల వారికీ అవకాశం కల్పించాలని ప్రొబిషన్, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్కుమార్ మీనా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల వారూ మద్యం టెండర్లలో నిమగ్నమయ్యారు. ఈనెల 11న జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో మొత్తం 3,396 దుకాణాలకు లాటరీల ద్వారా మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఒక్కరినే వేలం పాటకు అధికారులు ఆహ్వానిస్తారు.