భయపెడుతున్న వాయుగుండం
దక్షిణకోస్తా, రాయలసీమకు హైఅలర్ట్
మెరుపు వరదలకు అవకాశం: ఐఎండీ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్కు తుపాను ముప్పు పొంచింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు, మెరుపు వరదలకు అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమకు హై అలర్ట్ ప్రకటించింది. ఈనెల 17 అంటే గురువారం పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తా దగ్గర వాయుగుండం తీరం దాటుతుందని వెల్లడిరచింది. నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈనెల 16,17 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అకస్మాత్తు వరదలు సంభవించవచ్చని, రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 60కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని రెవెన్యూ విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో ఉన్న మత్స్యకారులంతా వెనక్కి రావాలని సూచించారు. ప్రజా రవాణా, రైళ్ల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని వాతావారణ శాఖ సూచనలు జారీ చేసింది. విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయాన్ని సందర్శించిన హోం మంత్రి వంగలపూడి అనితకు సిసోడియా తాజా పరిస్థితులను వివరించారు.
వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం
బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడే అవకాశమున్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నందున ముందస్తు చర్యల్ని తీసుకున్నది. ఈ మేరకు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె.పద్మావతి తెలిపారు. సంబంధిత జిల్లాల్లోని ఎపిడెమిక్ సెల్స్ 24 గంటలూ అందుబాటులో ఉండటంతో పాటు నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె చెప్పారు. పునరావాస శిబిరాల వద్ద వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశారని, గర్భిణిలకు ప్రసవ తేదీకి వారం రోజుల ముందుగా అన్ని సదుపాయాలున్న ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో అక్కడి ఎపిడెమిక్ సెల్ నంబరును ప్రజలకు తెలియజేయాలని, రాష్ట్ర ఎపిడెమిక్ సెల్ నంబరు (9032384168)తో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలు సమన్వయం చేసుకోవాలని పద్మావతి సూచించారు.