శ్రీనగర్లో అట్టహాసంగా కార్యక్రమం
హాజరైన ఇండియా ఐక్యసంఘటన నేతలు
ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు: కాంగ్రెస్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు శ్రీనగర్లోని షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా … ఒమర్ అబ్దుల్లా చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అలాగే మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ఇండియా ఐక్యసంఘటన నేతలు పాల్గొన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, డీఎంపీ ఎంపీ కనిమొళి కరుణానిధి, ఎన్సీపీ- ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే , ఒమర్ అబ్దుల్లా తండ్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్అబ్దుల్లా సహా ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తమ అభిమాన నేత సీఎంగా ప్రమాణం చేస్తుండడంతో నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆరేళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన జమ్మూకశ్మీర్ మొట్టమొదటి సీఎంగా ఒమర్ అబ్దుల్లా రికార్డు సృష్టించారు. ఇక అసెంబ్లీ ఎన్నికలలో నౌషెరా నియోజకవర్గంలో జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనాను ఓడిరచిన స్వతంత్ర ఎమ్మెల్యే సురీందర్ సింగ్ చౌదరిని కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్ల ఒమర్ అబ్దుల్లా ప్రకటిచారు.
‘నాడు చివర… నేడు మొదటి సీఎం నేనే’: ఒమర్ అబ్దుల్లా
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి ముందు తన తాత షేక్ మహ్మద్ అబ్దుల్లాకు ఒమర్ అబ్దుల్లా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనిచేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అయితే ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సొంత హక్కు ఉంది. నాకు విచిత్రమైన అనుభవాలు ఉన్నాయి. ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసిన చివరి ముఖ్యమంత్రిని నేనే. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతానికి తొలి సీఎం. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం ద్వారా మా పాలన మొదలవుతుంది’ అని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. మరోవైపు చాలా కాలం తర్వాత జమ్మూకశ్మీర్లో స్థిరమైన ప్రభుత్వం వచ్చినందకు సంతోషంగా ఉందని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం… ప్రజల సమస్యలను, బాధలను పరిష్కరిస్తుందని తెలిపారు. 2019 ఆగస్టు 5న కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ ఒక తీర్మానం కొత్త ప్రభుత్వం తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటు నిరుద్యోగం, డ్రగ్స్, విద్యుత్ వంటి ప్రధాన సమస్యలను అధిగమించేందుకు మార్గాలను కనుగొంటుందని ఆకాంక్షించారు.
అందుకే కొత్త ప్రభుత్వంలో చేరడం లేదు: కాంగ్రెస్
కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఎవరూ ప్రమాణస్వీకారం చేయడం లేదని జమ్మూకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా వెల్లడిరచారు. ‘ప్రస్తుతానికి మేం జమ్మూకశ్మీర్లోని నూతన ప్రభుత్వంలో చేరడం లేదు. జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్ బలంగా డిమాండ్ చేసింది. కానీ, అది ఇంతవరకు అది జరగలేదు. అసంతృప్తిగా ఉన్నాం.
ఈ విషయంలో మా పోరాటాన్ని కొనసాగిస్తాం’అని హమీద్ పేర్కొన్నారు. కాగా జమ్మూకశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగం కాబోదని, బయటి నుంచి మాత్రం మద్దతు ఇస్తుందని బుధవారం దిల్లీలో ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ను ప్రభుత్వంలో భాగం చేయాలని జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానాన్ని కోరినప్పటికీ దిల్లీ పెద్దలు అందుకు నిరాకరించారు. ఆ రాష్ట్రంలో పార్టీ నేతల పనితీరుపై అధిష్ఠానం అసంతృప్తిగా ఉందని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలకు నూతనంగా కొలువుదీరే ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చేందుకు ఒమర్ అబ్దులా సానుకూలంగా ఉన్నప్పటికీ అధిష్ఠానం ఒప్పుకోలేదని వెల్లడిరచారు. పదవులకు కాకుండా జమ్మూకశ్మీర్లో పార్టీ బలోపేతానికే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి కృషి చేయాలని స్థానిక నేతలను ఆదేశించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ప్రధాని మోదీ అభినందన
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్రం జమ్మూకశ్మీర్ పురోభివృద్ధికి ఒమర్తో కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించాయి. మొత్తం 90 సీట్లగాను ఎన్సీ 42 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఆరు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్సీ శాసనసభాపక్ష నేతగా ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.