ప్రతివాదులకు బాంబే హైకోర్టు నోటీసులు
వ్యాక్సిన్ కారణంగానే తన కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని..ఇందుకు పరిహారంగా సదరు టీకా తయారీ సంస్థ రూ.వెయ్యి కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా పిటిషనర్ ఆరోపణలపై స్పందన తెలియజేయాలంటూ వ్యాక్సిన్ తయారీ సంస్థతోపాటు ఇతర ప్రతివాదులను కోరింది.
మహారాష్ట్రకు చెందిన దిలీప్ లునావత్ కుమార్తె స్నేహాల్ మెడిసిన్ విద్యార్థిని. నాసిక్లో చదువుతున్న ఆమె 2021 జనవరిలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే అస్వస్థతకు గురైంది. తీవ్రమైన జ్వరం, వాంతులు మొదలుకావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. స్నేహాల్ మెదడులో రక్తస్రావం అవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గతేడాది మార్చి 1న ఆమె ప్రాణాలు విడిచింది. స్నేహాల్ తండ్రి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని (వ్యాక్సిన్ అనంతర దుష్ప్రభావాల కమిటీ) దర్యాప్తు జరిపింది. గతేడాది అక్టోబర్ 2న నివేదిక ఇచ్చింది. తన కూతురు మరణానికి వ్యాక్సినే కారణమని ఆరోపిస్తూ.. దిలీప్ లునావత్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏఈఎఫ్ఐ నివేదికను జత చేశారు. జస్టిస్ ఎస్వీ గంగాపూర్వాలా, జస్టిస్ మాధవ్ జందార్తో కూడిన ధర్మాసనం.. ఈ పిటిషన్ విచారణ చేపట్టింది.టీకా తయారీ సంస్థ, కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఆగస్టు 26న నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది. ఈ కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.