Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

కేజ్రీవాల్‌ బెయిల్‌ పరిశీలిస్తాం

. 7న వాదనలకు సిద్ధంగా ఉండండి
. ఈడీకి సుప్రీం ఆదేశం

న్యూదిల్లీ : దిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. మే 7న ఈడీ తరపున వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉండాలని అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ను ఆదేశించింది. జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చని ధర్మాసనం ఈడీకి తెలిపింది. మనీలాండరింగ్‌ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ‘ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఆయన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ విచారణను పరిశీలిస్తాం’ అని సుప్రీం ధర్మాసనం వెల్లడిరచింది. దీనిపై స్పందిస్తూ.. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను తాము వ్యతిరేకిస్తామని ఈడీ తరపున అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు పేర్కొన్నారు. దాంతో మరింత స్పష్టతనిచ్చిన ధర్మాసనం… ‘కేవలం పిటిషన్‌ను మాత్రమే విచారిస్తాం, బెయిల్‌ ఇస్తామని చెప్పడం లేదు. చివరకు బెయిల్‌ ఇవ్వొచ్చు, ఇవ్వకపోవచ్చు’ అని తెలిపింది. ఒకవేళ బెయిల్‌ ఇవ్వాల్సి వస్తే… ఎటువంటి షరతులు విధించాలో కూడా 7వతేదీన తెలియపర్చాలని… ఇందుకు సంబంధించి వాదనల కోసం సిద్ధమై రావాలని ఈడీకి సుప్రీం ధర్మాసనం సూచించింది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో మార్చి 21న అరెస్టు అయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. ప్రస్తుతం తిహార్‌ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్‌ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందన తెలియజేయాలని ఏప్రిల్‌ 15న ఈడీకి నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్‌ తరపున సీనియర్‌ న్యాయవాది ఏఎం సింఫ్వీు అత్యున్నత న్యాయస్థానంలో వాదించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img