. హర్యానా ఫలితాలు సుపరిపాలనకు నిదర్శనం
. జార్ఖండ్, మహారాష్ట్రలోనూ ఇవే ఫలితాలు
. జమ్మూకశ్మీర్లో బలమైన శక్తిగా బీజేపీ
. విభజన కన్నా జగన్తోనే రాష్ట్రానికి నష్టం
. సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : జమిలి ఎన్నికలకు దేశమంతా మద్దతివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజలకు, రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. త్వరలో దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని, దీంతోపాటు ఏడు శాతం వృద్ధి రేటు సాధిస్తుందని చంద్రబాబు దీమా వెలిబుచ్చారు. మౌలిక వసతులపై ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందువల్ల వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. సుస్థిర పాలన ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. ఈవీఎంలపై వైసీపీ నేత జగన్ చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు తప్పుపట్టారు. రాష్ట్రానికి జగన్ అతి పెద్ద అరిష్టమని, అసభ్య పదజాలానికి మారుపేరుగా వైసీపీ మారిందని, బూతులకు పేటెంట్గా ఆ పార్టీ నేతలున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు జరుగుతున్న నష్టంపై ఒక్కసారి కూడా నోరుమెదపని వారంతా… ఇప్పుడు తమను విమర్శిస్తారా అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని, అదేసమయంలో నష్టాలకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎం కోరారు. ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయాలని కుట్రపన్నిన వాళ్లు వరదలకు సంబంధించి తమ పనితీరును విమర్శిస్తారా అని మండిపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి రూ.400 కోట్లకు పైగావిరాళాలు ఇచ్చారని సీఎం కొనియాడారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా ఉత్సవాలు ఇంత కన్నుల పండువుగా గత ఐదేళ్లలో ఎప్పుడైనా జరిగాయా అని నిలదీశారు. ప్రసాదాలు మొదలు… అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. తమకు ఎవరి వల్ల లాభం జరుగుతుందో ప్రజలు ఆలోచిస్తే అది సుస్థిర ప్రభుత్వానికి నాంది పలుకుతుందని చంద్రబాబు తెలిపారు.
కేంద్ర పథకాలను త్వరితగతిన అందిపుచ్చుకుంటూ వెళ్తే రాష్ట్రానికి జరిగిన నష్టం నుంచి వీలైనంత త్వరగా కోలుకుని మళ్లీ నంబర్ 1గా ఎదుగుతామని చంద్రబాబు తెలిపారు. సామాజిక మాద్యమాల ద్వారా తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఇది మంచి పరిణామం కాదని ఆయన హితవు పలికారు.
విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే… గత ఐదేళ్లలో జగన్ వల్ల జరిగిన నష్టమే ఎక్కువ అని చంద్రబాబు మండిపడ్డారు. ఎవరి పరిపాలన వల్ల మంచి జరుగుతుందో… విజన్ వల్ల కలిగే లాభాల పట్ల ప్రజలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో రూ.75 వేల కోట్లను రైల్వే మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తున్నారని వివరించారు. దక్షిణ భారత దేశంలో బెంగళూరు- చెన్నై, అమరావతి-హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలను కలిపేలా బులెట్ ట్రైన్ తెచ్చే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అహంకారంతో విర్రవీగిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. హర్యానాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్రం సుపరిపాలనకు నిదర్శనమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భవిష్యత్లో జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపానన్నారు. జమ్మూ కశ్మీర్లో బలమైన పార్టీగా బీజేపీ అవతరించిందని కొనియాడారు. చెప్పే విధానం సరిగ్గా ఉండి… చేసేది మంచైనప్పుడు ఇలాంటి ఫలితాలే వస్తాయని చంద్రబాబు చెప్పారు.
మద్యం టెండర్లలో జోక్యాన్ని సహించను
మద్యం టెండర్లు పారదర్శకంగా జరగాలని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే నేతలను సహించబోనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మీడియా చిట్చాట్లో చంద్రబాబు మాట్లాడుతూ పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదన్నారు. ఇసుక లభ్యత తక్కువుగా ఉన్నందున అనేక ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. తక్కువ ధరకే ఇసుక సరఫరాకు ఆలోచిస్తున్నామన్నారు. ఇసుక సరఫరాలో ఎవరి జోక్యం లేకుండా చేస్తామన్నారు. గత ఐదేళ్లలో అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడిరది తానేనని, 53 రోజులపాటు జైల్లో ఉన్నానని గుర్తుచేశారు. తనను చంపే ప్రయత్నం జరిగినట్లు ప్రచారమైందన్నారు. తాను ఉన్న జైలులో డ్రోన్లు కూడా ప్రయోగించారని, కనీసం వేడి నీళ్లు ఇవ్వలేదని, దోమ తెరల సౌకర్యం కల్పించలేదని చెప్పారు. తనది కక్ష తీర్చుకునే స్వభావం కాదని, గత ఐదేళ్లుగా ఇబ్బందులకు గురైన వారి బాధలు తనకు తెలుసని అన్నారు.