రోడ్డు ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెల దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ డా.నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి (వాసు) భార్య, ఆయన ఇద్దరు కుమార్తెలు దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామానికి చెందిన డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసించారు. 1995లో ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికా వెళ్లారు. పిడీయాట్రిక్ కార్డియోవాస్య్కూలర్ అనస్థీషియనిస్ట్ గా పనిచేస్తూ హ్యూస్టన్ నగరంలో స్థిరపడ్డారు. 2017 నుంచి తానా బోర్డు సభ్యు డిగా ఉన్నారు. ఇక వాసు భార్య వాణి ఐటీ ఉద్యోగి. వారి ఇద్దరు కుమార్తెల్లో పెద్ద అమ్మాయి వైద్యవిద్యను అభ్యసిస్తుండగా, చిన్న కుమార్తె 11వ తరగతి చదువుతోంది. ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో కాలేజీ నుంచి కుమార్తెలను తీసుకువచ్చేందుకు కారులో వాణి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో టెక్సాస్ వాలర్ కౌంటీలో వారు ప్రయాణిస్తున్న కారును పికప్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భార్య ఇద్దరు కుమార్తెల మరణంతో డా.నాగేంద్ర బోరుమన్నారు. ఆయనను ఆపడం ఎవరితరం కాలేదు. నాగేంద్ర షాక్ లోకి వెళ్లిపోయారు. ఈ ఘటనపై తానా సభ్యులు, వాసు మిత్రులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.