. జాతీయ రహదారులపై వాహనాల క్యూ
. ప్రభుత్వ రవాణా సంస్థ ఆదాయానికి ప్రైవేట్ గండి
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : దసరా పండుగతో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీ పెరిగింది. బస్సులు, రైళ్ల ద్వారా అధిక శాతం ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు కార్లు, బైకుల్లో సొంత ఊర్లకు తరలివస్తున్నారు. శనివారం దసరా కావడంతో విజయవాడ
హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో పాటు టోల్ గేట్ల దగ్గర వాహనాలు గంటల కొద్దీ నిలిచిపోయి ప్రయాణికులు ట్రాఫిక్లో చిక్కుకుపోయి నానా అవస్థలకు గురవుతున్నారు. విద్యా సంస్థలకు 12 రోజుల పాటు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించగా… తెలుగు రాష్ట్రాల ప్రజలు అటూ, ఇటూ వెళ్లారు. ప్రభుత్వ కార్యాలయాలకూ సెలవులు ఇచ్చారు. విజయవాడ బస్స్టేషన్, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక బస్సులు, రైళ్లను నడుపుతున్నాయి. ఇదే సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రయాణికుల నుంచి నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ 6,100 ప్రత్యేక బస్సులను రెండు దశల్లో కేటాయించింది. తొలివిడత విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే 3,060 ప్రత్యేక బస్సులు శుక్రవారం నాటితో నిలిచిపోతాయి. ఇతర ప్రాంతాల నుంచి తిరుగు ప్రయాణం కోసం ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు మరో 3,040 బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీ ద్వారా హైదరాబాద్ నుంచి 990, బెంగళూరు నుంచి 275, చెన్నయ్ నుంచి 65 బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ నుంచి 400, విశాఖ నుంచి 320, రాజమహేంద్రవరం నుంచి 260… మిగిలిన జిల్లాల నుంచి 730 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు చెన్నయ్, హైదరాబాద్, బెంగుళూరు తదితర రాష్ట్రాలకు ఆర్టీసీ బస్సులు రాకపోకలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ప్రయాణికులకు అనువుగా ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. దక్షిణ మధ్య రైల్వే 1,400 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే ఆయా ప్రత్యేక బస్సులు, రైళ్లలో రిజర్వేషన్ల బెర్త్లు లభించని వారంతా ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.
ప్రైవేట్ యాజమాన్యం దోపిడీ
ఏపీఎస్ఆర్టీసీ ఆదాయానికి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం గండికొడుతోంది. సాధారణ చార్జీలతోనే వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుండగా… ప్రైవేట్ యాజమాన్యం ప్రయాణికులను నిలువు దోపిడీకి పాల్పడుతోంది. మూడు రెట్ల మేర టికెట్ ధరలను పెంచి వసూలు చేస్తున్నాయి. ఆర్టీసీ, రైళ్లలో సీట్లు దక్కని వారంతా ప్రైవేట్ బస్సులను ఆశ్రయించడంతో ఈ దుస్థితి ఏర్పడిరది. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్, విశాఖ, తిరుపతి తదితర నగరాలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖకు నడిచే పేరొందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులు ఈ దోపిడీకి పాల్పడుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఏసీ బస్సుల్లో సగటున ఒక్కో సీటుకు రూ.1,500, నాన్ ఏసీ బస్సుల్లో రూ.1,000 చొప్పున టికెట్ల ధరలను విపరీతంగా పెంచి దండుకుంటున్నారు. రాష్ట్రంలో 1,200 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులున్నాయి. ఇవి తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి విశాఖకు ఇదే స్థాయిలో టికెట్ ధరలను పెంచేశారు.
హైదరాబాద్ కేంద్రంగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు, హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతికి ఒక్కో బస్సుకు ఒక్కో రకంగా ఇష్టానుసారంగా టికెట్ ధరలను నిర్ధారించి ప్రయాణికుల నుంచి దోపిడీకి పాల్పడుతున్నారు. రవాణా శాఖ అధికారుల తనిఖీలు, ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రైవేట్ బస్సు టికెట్ల ధరలను విపరీతంగా పెంచేశారన్న విమర్శలున్నాయి.