. మూర్ఖపు నిర్ణయాలతో ప్రమాదంలో ప్రాజెక్టు మనుగడ
. కేంద్ర నిధులు సైతం దారి మళ్లింపు
. వైసీపీ హయాంలో 3.84 శాతమే పనులు
. ఎత్తు 45.72 నుంచి 41.15 అడుగులకు కుదింపు
. ప్రజలకు వాస్తవాలు తెలవాలనే శ్వేతపత్రం
. ప్రాజెక్టు విధ్వంసంపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: పోలవరం విధ్వంసంతో జగన్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జగన్ మూర్ఖపు నిర్ణయాలతో ప్రాజెక్టు మనుగడే ప్రమాదంలో పడిరదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పరిస్థితి చూస్తుంటే కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. పోలవరం ప్రాజెక్టు దుస్థితిపై వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి వివరాలు వెల్లడిరచారు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల్ల విధ్వంసంతో రాష్ట్రం ఎలా నష్టపోయిందో ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని, మొత్తం ఏడు ప్రధాన అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మన సమస్యలు కేంద్రం ముందు ఉంచాలి. అందుకే 25 రోజుల్లోనే ఏడు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసి తర్వాత రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. నీటిపారుదల అంశాలకు సంబంధించి వెబ్సైట్ ప్రారంభించి…అందులో అన్ని అంశాలు ఉంచుతామన్నారు. రాష్ట్రానికి రెండు ప్రధానమైన ప్రాజెక్టుల్లో ఒకటి పోలవరం…రెండు అమరావతి. ఆ రెండూ రాష్ట్రానికి రెండు కళ్లులాంటివి. అవి పూర్తి చేసుకుంటే రాష్ట్రానికి ఉన్న నష్టాన్ని పూడ్చు కోవచ్చు. జగన్ పోలవరానికి శాపంగా మారారు. జగన్ చేసిన నేరం క్షమించరానిది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జగన్ను అందరూ నిలదీయాలి. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. దక్షిణ భారతదేశంలో అత్యధిక నీళ్లు ఉండే ఏకైక నది గోదావరి. ఏటా 3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తోంది. వీటిని వినియోగించుకుంటే రాష్ట్రంలో కరవు అనేది ఉండదు. పోలవరం ద్వారా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. 23.50 లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు. పరిశ్రమలకు సమృద్ధిగా నీరందించవచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే వ్యవసాయానికి ఊతం వస్తుందనే శ్రద్ధ పెట్టాను. ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగించాను. ప్రతి సోమవారాన్ని పోలవరంగా భావించి 31 సార్లు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును పరిశీలించాను. టీడీపీ హయాంలో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.11,762.47 కోట్లు ఖర్చు చేస్తే… వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ప్రాజెక్టు పనులు నిలిపేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే పని చేసే ఏజెన్సీలను తొలగించారు. దీంతో వరదలతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. ఈ విషయాన్ని ఆయన రెండేళ్ల తర్వాత కనుక్కున్నారు. టీడీపీ హయాంలో ఉన్న కాంట్రాక్టరు పనితీరు సంతృప్తికరంగానే ఉంది. మార్చాల్సిన పనిలేదని పీపీఏ తమ మినిట్స్లో పేర్కొంది. కాంట్రాక్టర్ను మార్చితే జాప్యం జరుగుతుందని పీపీఏ హెచ్చరించింది. అయినా జగన్ ఎవరి మాటా వినలేదని, తనకు అన్నీ తెలుసు అన్నట్లుగా వ్యవహరించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ నిర్వాకంతోనే డయాఫ్రం వాల్,
కాఫర్ డ్యాం, గైడ్ బండ్ డ్యామేజీ
‘పోలవరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాలను ఎత్తిచూపేందుకు నీతి ఆయోగ్ నియమించిన నిపుణుల కమిటీ ప్రభుత్వ అసమర్థ ప్రణాళికతోనే డయాఫ్రం వాల్ దెబ్బతిందని నివేదిక ఇచ్చింది. డయాఫ్రం వాల్, ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం, గైడ్ బండ్ దెబ్బతిన్నాయి. వీటివల్ల దాదాపు రూ.4,900 కోట్ల నష్టం వాటిల్లింది. టీడీపీ ఐదేళ్లలో 72 శాతం పనులు పూర్తి చేస్తే…వైసీపీ 3.84 శాతం మాత్రమే పూర్తి చేసింది. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ప్రాజెక్టు కోసం ఖర్చు చేయకుండా రూ.3,385 కోట్లు దారిమళ్లించింది. టీడీపీ హయాంలో వచ్చిన గిన్నిస్ రికార్డుకు కేంద్రం ప్రశంసలు కురిపిస్తే…వైసీపీ హయాంలో నిపుణులు, పీపీఏ చీవాట్లు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. 45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే…వైసీపీ ప్రభుత్వం 41.15 మీటర్లకు కుదించింది. రూ.55,548 కోట్లకు కేంద్రంతో ఆమోదం తెలిపేలా మేము కృషి చేస్తే…గత ప్రభుత్వం అసలు నిధులు కూడా అడగలేదు. నిర్వాసితులకు జగన్ ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారు. పరిహారం ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తానన్నారు. పరిహారం అందిన వారికి కూడా రూ.5 లక్షలు అదనంగా ఇస్తానన్నారు. పరిహారం ఇవ్వకపోవడమే కాకుండా నిర్వాసితుల జాబితాలు మార్చి పరిహారం కాజేశారు.పైగా పోలవరం ప్రాజెక్టు పూర్తిపై అనేకసార్లు సవాళ్లు విసిరి, చివరకు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటూ జగన్…నాటి మంత్రి అంబటి రాంబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకిచ్చిన వాగ్దానాలు వీడియో ప్లే చేసి చూపించారు. పోలవరం ప్రాజెక్టు పట్ల గత ప్రభుత్వం చేసిన దుర్మార్గంతో ఒడిశా, చత్తీస్గఢ్ కూడా కేసులు వేసింది. ప్రాజెక్టును ఆషామాషీగా తీసుకోకూడదు. తేడాలు జరిగితే ప్రమాదం ఏర్పడుతుంది. ఇవన్నీ పరిష్కరించుకుని ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని చంద్రబాబు వివరించారు. సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు పాల్గొన్నారు.