. 18న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశం
. మద్యం, ఇసుక విక్రయాల్లో జోక్యం
. ‘పట్టభద్రుల’ఎన్నికలే కీలకాంశాలు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 18న సమావేశం నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీపరంగా ఎమ్మెల్యేలతో తొలిసారిగా భేటీ అవుతున్నారు. మద్యం, ఇసుక వ్యవహారాలలో ఎమ్మెల్యేల జోక్యాన్ని నివారించడం, పార్టీని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టడం, సభ్యత్వం పెంపు, అలాగే త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అభ్యర్థుల గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల అమలైన నూతన మద్యం పాలసీ అమల్లో భాగంగా కొందరు శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లోని మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులకు కనీసం లక్ష దరఖాస్తులు వస్తాయని, తద్వారా రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. కానీ మితిమీరిన రాజకీయ జోక్యంతో తొలి మూడు రోజుల పరిస్థితి చూస్తే వాటిలో సగం కూడా రావని స్పష్టమైంది. అనేక నియోజకవర్గాల్లో చాలా స్వల్ప సంఖ్యలో దరఖాస్తులు అందాయి. కొన్ని షాపులకు అయితే ఒక్కొక్కటి మాత్రమే దరఖాస్తు అందాయి. దీనిపై ఎక్సైజ్ శాఖలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలను హెచ్చరించడంతోపాటు, ఆయన సూచనలతో సీఎంఓ కూడా తీవ్రంగా స్పందించింది. క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకుని మరీ దరఖాస్తులను అడ్డుకుంటున్న వారికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి గట్టిగా హెచ్చరించింది. నేరుగా సీఎం కార్యాలయం నుంచి హెచ్చరికలు రావడంతో చాలా మంది ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారు. మరోవైపు ఎక్సైజ్ శాఖ కూడా దరఖాస్తుదారులకు ఆన్లైన్లో ఎక్కువ వెసులుబాటు కల్పించింది. సమాచారం కోసం ఎక్సైజ్ ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా మొత్తం వివరాలను ఆన్లైన్లో పెట్టింది. దేశంలో ఏ ప్రాంతం నుంచైనా డబ్బు చెల్లించే వెసులుబాటును కల్పించింది. దీంతో ఇతర రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో ఉండేవారు కూడా పెద్దసంఖ్యలో టెండర్ల దాఖలుకు పోటీపడ్డారు. దరఖాస్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. చివరి తేదీ గడువును కూడా మరో రెండు రోజులు పొడిగించడంతో, ఎక్సైజ్ శాఖ అంచనాకు తగినట్లుగా దాదాపు 90వేల మంది దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.18వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఈనెల 16నుంచి కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అయితే లాటరీలో షాపులు దక్కించుకున్న వారిని కూడా సిండికేట్ చేసి తమ గుత్తాధిపత్యంలో ఉంచుకునేందుకు కొందరు శాసనసభ్యులు ప్రయత్నిస్తున్నారు. జేసీ ప్రభాకర్రెడ్డి లాంటి వారు షాపులు ఎవరికొచ్చినా మాకు 20శాతం వాటా ఇవ్వాల్సిందేనని లాటరీ విజేతలను బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. అలాగే ఈనెల 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 108 కొత్త ఇసుక రీచ్ల ద్వారా రోజుకి 80వేల మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ రెండు అంశాల్లో శాసనసభ్యులు జోక్యం చేసుకుంటే ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటుందని సీఎం భావిస్తున్నారు. ఈ రెంటికీ ఎంత దూరంగా ఉంటే అంతమంచిదని సూచిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వానికి మచ్చ తీసుకురావడానికి, వైసీపీ ప్రభుత్వం అభాసుపాలు కావడానికి ఈ రెండు అంశాలను చంద్రబాబు కీలకంగా భావిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఒకసారి చంద్రబాబు హెచ్చరించినప్పటికీ, మరోసారి ఈ సమావేశంలో ఘాటుగా హెచ్చరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే త్వరలో జరుగనున్న కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కూటమి అభ్యర్థుల గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు మార్గనిర్దేశనం చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్దిదారులకు చేరువ చేయడంలో, విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో, పార్టీని స్థానికంగా బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, తదితర అంశాలపై కూడా చంద్రబాబు సూచనలు చేయనున్నారు.