అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
కడచూపు కోసం తరలివచ్చిన ప్రముఖులు, అభిమానులు
ముంబై: వ్యాపార దిగ్గజం, టాటా గ్రూప్స్ చైర్మన్ రతన్ టాటాకు యావత్ దేశం అంతిమ వీడ్కోలు పలికింది. అధికార లాంఛనాలతో, పార్సీ సంప్రదాయం ప్రకారం రతన్ టాటా అంత్యక్రియలు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగాయి. రతన్ టాటాకు బడా నాయకలు, పారిశ్రామికవేత్తలు, ప్రపంచ దేశాల ముఖ్యలు, క్రీడాకారులు, నటులు నివాళులర్పించారు. గురువారం ఉదయం రతన్ టాటా కొలాబా నివాసం నుంచి ఆయన భౌతికకాయాన్ని దక్షిణ ముంబైలోని ఎన్సీపీఆర్ (నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్) గ్రౌండ్స్కు తరలించారు. ప్రజల సందర్శనార్థం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 3.55 గంటల వరకు ఉంచారు. రతన్ టాటా కడచూపు కోసం వేలాది మంది తరలివచ్చారు. దీంతో నారిమన్ పాయింట్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లను ముంబై పోలీసులు చేశారు. సాయంత్రం 4 గంటలకు అక్కడ నుంచే వర్లీ శ్మశానవాటిక వరకు రతన్ టాటా అంతిమ యాత్ర జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. పోలీసుల గౌరవ వందనం అనంతరం అంతిమ సంస్కారాలను ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో నిర్వహించారు. అంతకుముందు పార్సీ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు, భౌతికకాయ అలంకరణ జరిగాయి. అంత్యక్రియల్లో కేంద్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్షా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్, వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు రాజకీయ, చలనచిత్ర, క్రీడా రంగాల ప్రముఖులు, టాటా సంస్థల ముఖ్యులు హాజరై రతన్ టాటాకు అంతిమ వీడ్కోలు పలికారు. రతన్ టాటా అంతిమ సంస్కారాలు పార్సీ సంప్రదాయాల ప్రకారం పూర్తి అయ్యాయని, ఆపై మూడు రోజుల కార్యక్రమాలను ఆయన కొలాబా నివాసంలో నిర్వహిస్తారని మత పెద్ద వెల్లడిరచారు. రతన్ టాటా మృతికి సంతాపసూచికగా గురువారం ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని ఏక్నాథ్ షిండే ఆదేశించారు. ఒక రోజు సంతాప దినాన్ని ప్రకటించారు. రతన్ టాటా దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణంతో ఒక శకం ముగిసిందని దేశ, విదేశాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
ఎన్సీపీఏ వద్ద ఉద్రిక్తత`లాఠీచార్జ్
తాము అభిమానించే శిఖరానికి అంతిమ వీడ్కోలు పలికేందుకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చారు. వేలాది మంది రావడంతో ఎన్సీపీఏ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తొక్కిసలాట తరహా పరిస్థితి ఏర్పడటంతో ముంబై పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాన్ని నియంత్రించేందుకు యత్నించారు.