. ఎన్నికల ముందు మూకుమ్మడిగా…
. లబోదిబోమంటున్న వలంటీర్లు
. మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలంటూ వినతులు
. రూ.10 వేల గౌరవ వేతనం పెంపుతో ఆశలు
. చేతులెత్తేసిన వైసీపీ నేతలు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ మార్పుతో రాజీనామాలు చేసిన వలంటీర్లు లబోదిబోమంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. గ్రామ, వార్డు సచివాయాలకు అనుబంధంగా వలంటీర్లు విధులు నిర్వహించి సంక్షేమం, ప్రజాసేవల్లో ప్రధాన భూమిక పోషించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వలంటీర్లను విధులకు దూరం ఉంచడంతో వారి సేవలు రెండు, మూడు నెలలుగా నిలిచిపోయాయి. వలంటీర్లు లేని లోటు ఇంటింటా పెన్షన్ల పంపిణీలోనూ కనిపించింది. అవ్వాతాతలు ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నికలకు ముందు చాలా నియోజకవర్గాల్లో వలంటీర్లు వైసీపీ నేతల హామీలను నమ్మి తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి నిండా మునిగినట్లు వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వలంటీర్లకు రూ.ఐదు వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చింది. ఎన్నికల ముందు కూటమి తరపున టీడీపీ, జనసేన ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోలో వలంటీర్లకు రూ.10వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడం, చంద్రబాబు సీఎంగా, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా అయ్యారు. ఎన్డీఏ ఉమ్మడి కూటమి సమావేశంలోను మనం మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన అవసరముందని పవన్ కల్యాణ్ నొక్కిచెప్పారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక్కసారిగా వలంటీర్ల గౌరవ వేతనం రూ.ఐదువేల నుంచి రూ.10 వేలకు పెరగనుంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడం, పరిపాలపై వేగవంతం చేసే పనిలో నిమగ్నమవ్వడంతో… మేనిఫెస్టోలో తమకు ఇచ్చిన హామీపై వలంటీర్లు ఆశతో ఉన్నారు. దీంతో రూ.10వేల వేతనం కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానికంగా ఉన్న 18 నుంచి 35 ఏళ్ల యువతను వలంటీర్లుగా నియమించారు. వారి విద్యార్హతను ఇంటర్మీడియట్గాను, గిరిజన ప్రాంత వాసులకైతే పదో తరగతిగాను నిర్ధారించి ఎంపిక చేశారు. వారంతా అదే గ్రామ, వార్డుకు చెందిన వారై ఉండాలన్న నిబంధన విధించారు. 50 కుటుంబాలకు ఒక వలంటీరు చొప్పున బాధ్యత కేటాయించారు. ఈ తరహాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల 30వేల మంది వలంటీర్లను నియమించారు. వారికి రూ.ఐదువేల గౌరవ వేతనం అమలు చేశారు. ప్రభుత్వం అందించే సేవలు, పథకాలపై ఖచ్చితమైన సమాచారం అందించడమే వలంటీర్ల ప్రధాన లక్ష్యంగా గత ప్రభుత్వం నిర్ధారించింది.
ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజీనామా వలంటీర్లు రోడ్డెక్కుతున్నారు. రాష్ట్ర మంత్రులకు ప్రకటించిన శాఖల్లోను ప్రత్యేకంగా గ్రామ, వార్డు సచివాలయం, వలంటీర్లకు ఒక శాఖను కేటాయించారు. గత ప్రభుత్వం తరహాగానే వలంటీర్లకు ప్రత్యేక మంత్రిత్వశాఖ కేటాయించడంతో వారిలో ఆశలో పెరిగాయి. ఈశాఖ మంత్రిగా ప్రకాశంజిల్లా కొండెపి నియోజకవర్గానికి చెందిన డోలా బాల వీరాంజనేయులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రిగా నియమితులైన నిమ్మల రామానాయుడు వలంటీర్ల వ్యవస్థను తొలగించబోమని వెల్లడిరచారు. ఇప్పటికే మంత్రి డోలాను గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. పదోన్నతుల దగ్గర నుంచి విధుల నిర్వహణలో ప్రక్షాళన చేపట్టాలని, ఏక రూప దుస్తుల నిబంధన తొలగించాలని కోరగా…ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో రాజీనామాలు చేసిన వలంటీర్లు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇలా రాజీనామాలు చేసిన వలంటీర్ల సంఖ్య తొలుత వందల్లో ఉండగా… అది ఎన్నికల సమయానికి వేలకు చేరింది. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పట్టణం, కొవ్వూరు నియోజకవర్గాల్లో వందలాదిగా వలంటీర్లు రాజీనామాలు చేసి టీడీపీలోకి వెళ్లిన సందర్భాలున్నాయి. ఎంత మంది రాజీనామాలు చేశారనేదీ, వారిలో ఎందరివి ఆమోదించారనేదే అధికారికంగా ప్రభుత్వం వెల్లడిరచాల్సి ఉంది. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, చిత్తూరు తదితర జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో వలంటీర్లు రాజీనామాలు చేశారు. మిగిలిన వాంతార మౌనంగా ఉండిపోయారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే వలంటీర్లకు జూన్ నెల గౌరవ వేతనం రూ.ఐదు వేలు వారి బ్యాంకు ఖాతాల్లో పడిరది. రాజీనామాలు చేసిన వారికి మాత్రం గౌరవ వేతనం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికక్కడే స్థానిక సంస్థలకు చెందిన నేతలను కలుస్తూ వినతులను అందజేస్తున్నారు.
మోసబోయామంటూ నెల్లూరులో ఫిర్యాదు
వైసీపీ నేతల మాటలు నమ్మి తాము మోసబోయామని వాపోతూ నెల్లూరు చిన్నపట్టణం పోలీస్స్టేషన్లో పలువురు వలంటీర్లు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇదే తరహాగా రాజీనామాలు చేసిన వలంటీర్లు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను కలుస్తు న్నారు. మరోవైపు వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కలుస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మీ మాటలు నమ్మి బలవంతంగా రాజీనామాలు చేశామని వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము జీవనాధారం కోల్పోయామని వాపోతున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు రాజీనామాలు చేసిన వలంటీర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా మంది వైసీపీ స్థానిక నేతలకు ఫోన్లు చేసి తమను విధుల్లోకి తీసుకునేలా చూడాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమా చారం. వారి ఫోన్లకు వైసీపీ నేతలు స్పందిం చకుండా మౌనం దాలుస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇళ్లకు సైతం వెళ్లి వారిని నిలదీయడంతో ఏం చెప్పాలో తెలియక వైసీపీ నేతలు వారిని పంపేస్తున్నారు. ప్రభుత్వం మార్పుతో తామేమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు.