నేడు యూపీలో రైతు, ఖాప్ నేతల సమావేశం
ముజఫర్నగర్: మైనర్తో సహా యువ క్రీడాకారిణులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు అన్ని వర్గాల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఇందులో భాగంగా దేశానికి చెందిన అగ్రశ్రేణి రెజ్లర్లు కొందరు కొనసాగిస్తున్న నిరసనను ఉద్దేశించి తమ సంఫీుభావం తెలిపేందుకు ఒక ప్రముఖ రైతు సంఘం ఉత్తరప్రదేశ్కు చెందిన ముజఫర్నగర్ జిల్లాలోని సౌరమ్ పట్టణంలో గురువారం ఒక భారీ సమావేశానికి పిలుపునిచ్చింది. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు, బల్యాన్ ఖాప్ అధ్యక్షుడు నరేశ్ తికైత్ మాట్లాడుతూ సౌరమ్ చౌపల్లో చారిత్రక మహాపంచాయత్ సందర్భంగా రెజ్లర్ల నిరసనోద్యమం ప్రధానాంశంగా చర్చించనున్నట్లు ప్రకటించారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్పై తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు, ఈ ఏడాది జనవరిలో న్యూదిల్లీలో తమ నిరసనను ప్రారంభించారు. కాగా మంగళవారం జరిగిన నాటకీయ పరిణామాలలో ఒలింపిక్ పతకాల విజేతలు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, ఆసియా గేమ్స్ ఛాంపియన్ వినేశ్ ఫోగట్ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు మంగళవారం హరిద్వార్లోని గంగా నది ఒడ్డున సమావేశమయ్యారు. అధికార బీజేపీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్ పట్ల నిష్క్రియాత్మకంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ తమ ప్రపంచ, ఒలింప్ పతకాలను గంగా నదిలో విసిరివేస్తామని వారు బెదిరించారు. అయితే నరేశ్ తికైత్, ఇతర ఖాప్, రైతు నాయకులు ఐదు రోజుల్లోగా సమస్యను పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చి, క్రీడాకారులను ఆ చర్య నుంచి నిలువరించారు. తికైత్ మీడియాకు తన సందేశంలో, అథ్లెట్లను ప్రశంసించారు. వారి కారణంగా మేము అంతర్జాతీయ క్రీడా రంగంలో మా తల ఎత్తుకుంటాము. వారు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం లేకుండా చూసుకుంటాము’ అని పేర్కొన్నారు. మహాపంచాయత్కు ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్, దిల్లీ నుంచి వివిధ ఖాప్ల ప్రతినిధులు, వారి అధిపతులు హాజరవుతారని, కుస్తీ నిరసనలో తదుపరి దశలను నిర్ణయించాలని భావిస్తున్నారు. మే 28న దిల్లీ పోలీసులు అనేక మంది రెజ్లర్లను అదుపులోకి తీసుకుని, శాంతిభద్రతలను ఉల్లంఘించినందుకు వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన తర్వాత ఇది జరిగింది. అథ్లెట్లు భారత పార్లమెంటు కొత్త భవనం వైపు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు వారిని అక్కడ నుంచి చెల్లాచెదురు చేసేందుకు లాఠీఛార్జ్ చేశారు. రెజ్లింగ్ క్రీడకు సంబంధించి అంతర్జాతీయ మండలి యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) రెజ్లర్లను నిర్బంధించడాన్ని ఖండిరచింది. సింగ్పై చర్యలు తీసుకోకపోవడాన్ని విమర్శించింది. డబ్ల్యూఎఫ్ఐ కోసం 45 రోజులలోపు తాజా ఎన్నికలను నిర్వహిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) వాగ్దానాన్ని గుర్తు చేసింది. అలా చేయడంలో విఫలమైతే సమాఖ్య సస్పెన్షన్కు దారితీయవచ్చని హెచ్చరించింది. అథ్లెట్ల భద్రత గురించి యూడబ్ల్యూడబ్ల్యూ ఆందోళన వ్యక్తం చేసింది. వారి పరిస్థితులపై చర్చించడానికి రెజ్లర్లతో సమావేశం నిర్వహించాలని యోచిస్తోంది.