హేమంత్ సోరెన్ విడుదలపై రాజా హర్షం
రాంచీ: మతతత్వ ఫాసిస్టు శక్తులపై పోరాటానికిగాను ఇండియా ఐక్య సంఘటన కిందకు అన్ని ప్రజాస్వామిక లౌకిక పార్టీలను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తెలిపారు. లౌకిక పార్టీల ఐక్యతకు జేఎంఎం నేత, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ విడుదల దోహదపడుతుందన్నారు. హేమంత్ సోరెన్కు బెయిల్ లభించడాన్ని రాజా స్వాగతించారు. ఆయన శనివారం జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ‘హేమంత్ సోరెన్కు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నాం. ఆయన జైలు నుంచి బయటకు వచ్చేశారు. రాష్ట్రంలోని లౌకిక పార్టీలు మరింత దగ్గరయ్యేందుకు ఆయన దోహదపడతారు. మతోన్మాద ఫాసిస్టు శక్తులపై పోరుకు ఇండియా ఐక్య సంఘటన ఛట్రం కిందకు అన్ని ప్రజాస్వామిక లౌకిక పార్టీలను తెచ్చే ప్రయత్నం సాగిస్తున్నాం. పార్లమెంటు లోపల కూడా సయోధ్యకు యత్నిస్తున్నాం’ అని చెప్పారు. అదే సమయంలో నీట్`యూజీ పరీక్ష రద్దునకు రాజా డిమాండ్ చేశారు. దేశంలో ఉద్యోగులు, రైతులు, గిరిజనుల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థ స్థితి అంతంత మాత్రమేనని అన్నారు. ఇందుకు మోదీ ప్రభుత్వ దుష్పరిపాలన, వినాశకార విధానాలే కారణమని రాజా దుయ్యబట్టారు. అఖిలభారత కిసాన్ మహాసభ అధ్వర్యంలో జార్ఖండ్లో జరగబోయే కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను రాజా రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు.