. పక్షం రోజులు సమావేశాలు
. పూర్తిస్థాయి బడ్జెట్కు ప్రభుత్వ సన్నాహాలు
. సూపర్సిక్స్ హామీలే లక్ష్యంగా ఆర్థిక శాఖ కసరత్తు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వచ్చే నెలలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభ తేదీ, ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రానప్పటికీ పక్షం రోజుల పాటు జరిగే అవకాశాలున్నట్లు అధికారులు చెపుతున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆర్థికశాఖ అధికారులు ఇప్పటికే బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై ఉండగా, శాసనసభ, ఆర్థిక వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆర్థిక శాఖ అధికారులతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఏడాది మే 13వ తేదీ సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని గత వైసీపీ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మొత్తం రూ.2,86,389 కోట్లకు బడ్జెట్ సమర్పించారు. 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40 గ్రాంట్ల కింద రూ.1,09,052.34 కోట్లకు శాసనసభ ఆమోదం తీసుకున్నారు. జూన్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉండగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, ఎన్ని అప్పులున్నాయో తెలియని గందరగోళ పరిస్థితుల్లో వాయిదా వేసింది. పాత బకాయిలు, అప్పులు, సంక్షేమ పథకాల అమలుకు అయ్యే ఖర్చులు తదితర వివరాలు అన్నీ రాబట్టి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం వెలువరించిన అనంతరం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మరోసారి ఓటాన్ ఎకౌంట్కు ఆర్డినెన్సు రూపంలో ఆమోదం తీసుకున్నారు. ఆగస్టు నుంచి నవంబరు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు, ఇతర కార్యకలాపాల కోసం రూ.1,29,972.97 కోట్లతో 40 గ్రాంట్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్కు గవర్నర్ ఆమోదం పొందారు. ఇలా దాదాపు ఎనిమిది నెలల కాలం ఓట్ ఆన్ అకౌంట్ పద్దుతోనే గడిచిపోయింది. వాస్తవానికి చివరి నాలుగు నెలల కాలానికి కూడా బడ్జెట్ ఖర్చులకు ఆమోదం తీసుకునే అవకాశం ఉన్నా, ఏడాది మొత్తానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నవంబరులో నిర్వహించే శాసనసభ శీతాకాల సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదం పొందనున్నారు. ప్రస్తుతం ఆర్థికశాఖ కార్యదర్శి ఆయా ప్రభుత్వ శాఖలతో ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. తదుపరి దశలో మంత్రుల స్థాయిలో సమావేశాలు ఉంటాయి.
ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ఎన్డీయే కూటమి సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు భారీగా సంక్షేమ పథకాల అమలుకు హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే వృద్ధాప్య, ఇతర పెన్షన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాల వ్యయం కన్నా మరో రూ.20 వేల కోట్ల వరకు అదనంగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుతో పాటు, ప్రభుత్వ ప్రాధాన్యతకనుగుణంగా ఆర్థిక శాఖ బడ్జెట్ కసరత్తు నిర్వహిస్తోంది.