హైకోర్టులో పిటిషన్పై వాదనలు
అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి వలంటీర్ల పరిస్థితి అయోమయంగా మారింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వలంటీర్ల కొనసాగింపుపై స్పష్టతలేదు. వలంటీర్లను తొలగించాలని ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై బుధవారం విచారణ కొనసాగింది. దాదాపు 2.60లక్షల మంది వలంటీర్ల నియామకంలో నిబంధనల ఆధారంగా జరగలేదని, రిజర్వేషన్లు పాటించలేదని పిటిషనర్ మనోజ్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. వైసీపీ సానుభూతిపరులను వలంటీర్లుగా నియమించారని తెలిపారు. దీనిపై వాదోపవాదనలు జరగగా, ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే పెన్షన్ల పంపిణీలో వలంటీర్లను ప్రభుత్వం దూరంగా పెట్టింది. జులై 1 నుంచి పెన్షన్లను గ్రామ, వార్డు సచివాలయ శాశ్వత ఉద్యోగులతోనే పంపిణీ చేయించాలని నూతన ప్రభుత్వం నిర్ణయించింది. దీనికితోడుగా అసలు వలంటీర్లనే తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడంతో వారికి దిక్కుతోచడం లేదు. దీంతో వలంటీర్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ హయాంలో గ్రామ, వార్డు సచివాయాలకు అనుబంధంగా 2.60లక్షల మంది వలంటీర్లను నియమించి, వారి ద్వారా పెన్షన్లు, సంక్షేమ పథకాల పంపిణీకి, సేవలకు ఉపయోగించింది. పెన్షన్ల పంపిణీలో వలంటీర్ల పాత్ర కీలకంగా నిలిచింది. ఎన్నికల సమయంలో వేలాది మంది వలంటీర్లు వైసీపీ నేతల మాటలతో రాజీనామాలు చేశారు. లక్షన్నరకుపైగా విధుల్లోనే ఉన్నారు. వారికి అప్పటి నుంచి గౌరవ వేతనం రూ.5వేలు పడుతోంది. కూటమి మేనిఫెస్టోలో వలంటీర్లకు రూ.10వేల గౌరవ వేతనం ఇస్తామని హామీఇచ్చారు. ఆ హామీకి ఆకర్షితులైన వలంటీర్లు కూటమికి మద్దతిచ్చినట్లుగా చెబుతున్నారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్ల సేవలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దానికితోడు వలంటీర్లను తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్పై ఉత్కంఠగా మారింది. రాజీనామా చేసిన వారు, రాజనీమా చేయకుండా విధుల కోసం వేచిస్తున్న వారంతా ప్రభుత్వంపైనే నమ్మకం పెట్టుకున్నారు. హైకోర్టుకు ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇస్తుందనే దానిపై వలంటీర్లు ఎదురు చూస్తున్నారు. అసలు వలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనేదీ ఆసక్తికరంగా మారింది.