. బిల్లుల చెల్లింపు, ఈ`గవర్నెన్స్… మెటాతో ప్రభుత్వం ఒప్పందం
. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : యువగళం హామీలు నెరవేర్చడంలో మెటాతో అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) ఒక చారిత్రక మైలురాయి అని, ఇక నుంచి వాట్సాప్ ద్వారానే పౌరసేవలు అందుబాటులోకి రానున్నట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడిరచారు. మంత్రి లోకేశ్ చొరవతో మెటా ప్రజలకు ప్రభుత్వం నుంచి పౌరసేవలు వాట్సప్ బిజినెస్ ద్వారా అందించేందుకు అంగీకరించింది. మెటా ఫ్లాట్ ఫాం వాట్సప్ బిజినెస్ ద్వారా ఇకపై కుల ధ్రువీకరణ, ఇతరత్రా పత్రాలను వేగంగా, సులభంగా పొందేందుకు వీలు అవుతుంది. నకిలీలు, ట్యాంపరింగ్ అవకాశం లేకుండా పారదర్శకంగా ఆన్ లైన్లోనే ధ్రువీకరణ పత్రాల జారీ ఉంటుంది. మెటా నుంచి కన్సల్టేషన్ సాంకేతిక మద్దతు, ఈ`గవర్నెన్స్ అమలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా మరిన్ని పౌర సేవలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించేలా మంత్రి లోకేశ్ నేతృత్వంలో రాష్ట్ర అధికారులు, మెటా ప్రతినిధులు దిల్లీలోని 1 జన్పథ్లో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఎంవోయూ చేసుకున్నారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం పడుతున్న కష్టాలు ప్రత్యక్షంగా చూసి… మొబైల్లోనే ఆయా ధ్రువీకరణ పత్రాలను అందజేస్తామని హామీ ఇచ్చానని గుర్తుచేశారు. వాట్సప్లోనే ధ్రువీకరణ పత్రాలు, పౌరసేవలు పొందేలా మెటాతో ఒప్పందం చేసుకున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని సేవలు ఆన్లైన్లో అతి సులువుగా, పారదర్శకంగా, అతి వేగంగా పొందే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. హెచ్సీఎల్ విస్తరణ, ఫాక్స్ కాన్, టీసీఎల్ వంటి గేమ్ ఛేంజర్ కంపెనీలను రప్పించామన్నారు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తోందని ఆయన తెలిపారు. మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్ మాట్లాడుతూ మెటాలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేవలను వాడుకుని వాట్సప్ ద్వారా ఏపీ ప్రజలకు పౌర సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందరూ తమకు కావాల్సిన సేవలు పొందేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, వాట్సప్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ ఉంటుందన్నారు. తమ డిజిటల్ టెక్నాలజీని వాడుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరిన్ని ఉత్తమసేవలు అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెటా ఇండియా డైరెక్టర్ రవి గార్గ్, డైరెక్టర్ పబ్లిక్ పాలసీ నటాషా, ప్రభుత్వం తరపున ఐఏఎస్ అధికారులు యువరాజ్, ఆర్టీజీఎస్ సీఈఓ దినేశ్ పాల్గొన్నారు.