. 2029లో రాహుల్ ప్రధాని, షర్మిల సీఎం ఖాయం
. వైఎస్ స్ఫూర్తితో రాహుల్ జోడో యాత్ర
. బాబు, జగన్, పవన్ మోదీ పక్షమే
. కడపలో ఉప ఎన్నికలొస్తే ఊరూరా తిరుగుతా
. కార్యకర్తల త్యాగం, షర్మిల పోరాటం ఊరికే పోదు
. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు
. కాంగ్రెస్ అధ్వర్యంలో ఘనంగా వైఎస్ 75వ జయంతి
విశాలాంధ్ర బ్యూరో- అమరావతి : ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో వైఎస్ రాజశేఖర్రెడ్డి అరుదైన ముద్ర వేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి కొనియా డారు. వైఎస్ఆర్ దూరమై 15 ఏళ్లు అయినా… ఆయన జ్ఞాపకాలు ఇంకా మన ముందు కదులు తున్నాయని, రెండు రాష్ట్రాల్లో సంక్షేమం, అభివృద్ధి పైన చర్చ జరిగినప్పుడు వైఎస్ఆర్ లేనిలోటు కన్పిస్తుందని రేవంత్రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నాయకత్వంలో ఈ వేడులను ఏర్పాటు చేయగా, ముఖ్య అతిధులుగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, సీతక్క, ఏపీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, వైఎస్తో అనుబంధమున్న నాయ కులు విచ్చేశారు. తొలుత వైఎస్ఆర్ చిత్రపటానికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, షర్మిల తదితరులు పూలమాలలేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనం తరం సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు అధ్యక్షతన సమావేశంలో వక్తలు ప్రసంగించారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ… ఏపీలో కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం, షర్మిల పోరాటం ఊరికే పోదన్నారు. 2029లో రాహుల్ గాంధీ ప్రధాని, ఏపీలో షర్మిల ముఖ్యమంత్రి కావడం తథ్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మాట తప్పం, మడమ తిప్పేది లేదనే మాట వింటే వైఎస్ గుర్తుకొస్తారని చెప్పారు. కడపలో ఉప ఎన్నికలు వస్తున్నాయనే వార్తలు వస్తున్నాయని… అదే జరిగితే కడపలో కాంగ్రెస్ గెలుపు కోసం ఊరూరా తాను తిరిగే బాధ్యతను తీసుకుంటానని చెప్పారు. మీరంతా కలసి రావాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ఈ కార్యక్రమానికి రావాలని అనుకున్నప్పటికీ, మణిపూర్ పర్యటనతో హాజరు కాలేకపోయారని చెప్పారు. కొత్తగా చట్టసభలకు వచ్చిన వారిని ప్రోత్సహిస్తే…కొత్త నాయకత్వం వస్తుందని వైఎస్ అనేవారన్నారు. ఏ సమస్య వచ్చినా అందరికీ సమయం ఇచ్చి పరిష్కరించేవారని, రెండు రాష్ట్రాల్లో ఆయనకు లక్షలాది మంది అభిమానులున్నారని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులతో హుందాగా ఉండేవారని చెప్పారు. నాడు ఎర్రటి ఎండలో వైఎస్ పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లారని గుర్తుచేశారు. వైఎస్ స్ఫూర్తితోనే రాహుల్గాంధీ జోడో యాత్రను చేపట్టారన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలో ఉందని చెబుతూ… బీజేపీ అంటే బాబు..జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన పోరాడేదీ షర్మిల మాత్రమేనన్నారు. చంద్రబాబు, జగన్, పవన్ మోదీ పక్షమేనని విమర్శించారు. వైఎస్ పేరుతో వ్యాపారం చేసే వాళ్లు వారసులు కాదని, ప్రజల కోసమే పోరాడేవారే నిజమైన వైఎస్ వారసులని వ్యాఖ్యానిం చారు. మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ వైఎస్ స్ఫూర్తితోనే తాము ఇంత స్థాయికి ఎదిగామన్నారు. తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసులురెడ్డి, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఏపీలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. షర్మిల నేతృత్వంలో పార్టీకి పూర్వవైభవం వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్కుమార్, పార్టీ నేతలు ఎన్.రఘువీరారెడ్డి, షబ్బీర్ అలీ, తులసిరెడ్డి, కనుమూరి బాపిరాజు తదితరులు మాట్లాడుతూ… వైఎస్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ పరిపాలన, ప్రజలకు ఆయన అందించిన సేవలను స్మరించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటేనే ముఖం నిండా చిరు నవ్వు అని, నడుచుకుంటూ వచ్చే రాజసం ఉంటుందన్నారు. నేడు వైఎస్ఆర్ వారసులమని చెప్పుకునే వారంతా బీజేపీతో అంటకాగుతున్నారని విమర్శించారు. తెర వెనుక పొత్తులు పెట్టుకుని వైఎస్ఆర్ ఆశయాలను తుంగలో తొక్కారన్నారు.