విశాలాంధ్ర – హైదరాబాద్ : సీఆర్ ఫౌండేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, పల్లా వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. చీఫ్ ప్యాట్రన్గా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, గౌరవ సలహాదారుడిగా సురవరం సుధాకరరెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా డా.కె.నారాయణ ఎన్నికయ్యారు. చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ (సీఆర్ ఫౌండేషన్) సర్వసభ్య సమావేశం బుధవారం హైదరాబాద్ కొండాపూర్లోని సీఆర్ ఫౌండేషన్ ప్రాంగణం ఇంద్రజిత్ గుప్తా మెమోరియల్ హాల్లో జరిగింది. పార్లమెంట్ మాజీ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. అధ్యక్షుడు డాక్టర్ కె.నారాయణ పాల్గొన్నారు. సీఆర్ ఫౌండేషన్ అధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమం, నీలం రాజశేఖర్ రెడ్డి రీసెర్చ్ సెంటర్, మహిళా సంక్షేమ కేంద్రం, ఆరోగ్య కేంద్రాల కార్యకలాపాలను సమావేశం సమీక్షించింది. ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి ప్రవేశపెట్టిన కార్యకలాపాల నివేదికను సమావేశం ఆమోదించింది. కోశాధికారి చెన్నకేశవరావు ప్రవేశపెట్టిన జమా ఖర్చుల నివేదికను ఆమోదించింది. తర్వాత నూతన ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. సీఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులుగా మాజీ ఎంపీ అజీజ్ పాషా, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, కంభంపాటి అజయ్కుమార్, కార్యదర్శులుగా చెన్నమనేని వెంకటేశ్వరరావు, పీజే చంద్రశేఖర్రావు, పడికిటి సంధ్యాకుమారి, కోశాధికారిగా వి.చెన్నకేశవరావును సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కార్యవర్గ సభ్యులుగా మాజీ ఎమ్మెల్యేలు మానం ఆంజనేయులు, చాడ వెంకటరెడ్డి, కె.రామకృష్ణ, డాక్టర్ రజనీ, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, అక్కినేని వనజ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డాక్టర్ టి.సురేశ్, జోశ్యభట్ల కల్పన, కంభంపాటి అజయ్ కుమార్, కె.శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు.