. మత కార్యక్రమంలో తొక్కిసలాట, 122 మంది మృతి
. దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు
. రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన మోదీ, యోగి
ఉత్తరప్రదేశ్, హత్రాస్లో విషాదం చోటుచేసుకుంది. స్వీయ ప్రకటిత భోలే బాబా అధ్వర్యంలో నిర్వహించిన సత్సంగ్కు పరిమితికి మించి భక్తులు హాజరైన క్రమంలో తొక్కిసలాట జరిగి 122 మంది చనిపోయారు. సభా స్థలి ఇరుకుగా ఉండటంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉక్కుపోతతో సతమతమయ్యారు. కార్యక్రమం ముగిసిన వెంటనే కిక్కిరిసిన హాలు నుంచి బయటకు పరుగు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగి ఒకరిపై ఒకరు పడిపోయారు.
లక్నో: ఉత్తరప్రదేశ్, హత్రాస్లో విషాదం చోటుచేసుకుంది. స్వీయ ప్రకటిత భోలే బాబా అధ్వర్యంలో సత్సంగ్కు పరిమితికి మించి భక్తులు హాజరైన క్రమంలో తొక్కిసలాట జరిగి 122 మంది చనిపోయారు. సభా స్థలి ఇరుకుగా ఉండటంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉక్కుపోతతో సతమతమయ్యారు. కార్యక్రమం ముగిసిన వెంటనే కిక్కిరిసిన హాలు నుంచి బయటకు పరుగు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగి ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ మేరకు పోలీసులు తెలిపారు. వందల మందికి గాయాలయ్యాయని, చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతులు పెరగవచ్చని చెప్పారు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఇటాహత్రాస్ జిల్లా సరిహద్దులోని రతి భాన్పూర్ గ్రామంలో చోటుచేసుకుందని ఇటా ఎస్పీ రాజేశ్ కుమార్ సింగ్ చెప్పారు. సత్సంగ్కు 15వేల మంది వరకు హాజరయ్యారన్నారు. గాయపడిన వారికి సికంద్రౌ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, హత్రాస్ జిల్లా ఆసుపత్రి, ఇటా వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నట్లు ఐజీ (అలీగఢ్ రేంజ్) మాథూర్ తెలిపారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ ఆ భయానక దృశ్యాన్ని మరువలేనన్నారు. ‘భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బయటకు వెళ్లేందుకు దారి లేక తోసుకున్నారు. తొక్కిసలాటలో కొందరు స్పృహ కోల్పోగా ఇంకొందరు ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపారు.
సీఎం విచారం
రూ.2లక్షల పరిహారం
ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలిచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. నిర్వాహకులపై కేసు పెట్టి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించేందుకు ఏడీజీ ఆగ్రా, అలీగఢ్ కమిషన్ నేతృత్వంల్యో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసేందుకు ఆదేశాలిచ్చారు. క్షేత్రస్థాయి పరిస్థితులను డీజీపీ ప్రశాంత్ కుమార్తో పాటు మంత్రులు చౌదరి లక్ష్మీ నారేన్, సందీప్ సింగ్, సీఎస్ మనోజ్ సింగ్ సమీక్షించినట్లు సీఎం ట్వీట్ చేశారు. కాగా, పీఎంఎన్ఆర్ఎఫ్ ద్వారా మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు.
ప్రముఖుల దిగ్భ్రాంతి
హత్రాస్ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.లోక్సభలో హత్రాస్ ఘటనను ప్రధాని ప్రస్తావించారు. ఇది బాధాకరమని, రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఘటన బాధాకరమని, గాయపడిన వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచించారు. సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలంటూ ఇండియా ఐక్య సంఘటన శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్షా విచారం వ్యక్తంచేశారు. భారత్కు జర్మన్ రాయబారి ఫిలిప్ ఆకర్మ్యాన్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తంచేస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి సత్వరమే సహాయం అందుతుందని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
న్యాయం చేయాలి: కాంగ్రెస్
ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చినప్పుడు ఇలాంటి ఘటనలకు స్థానిక యంత్రాంగం ఎందుకని సన్నద్ధం కాలేదని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో సరిపడ వైద్యులు, అవసరమైన వైద్య సౌకర్యాలు, పరికరాలు అందుబాటులో లేకపోవడం తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధితులకు న్యాయం చేయాలని పవన్ ఖేరా డిమాండ్ చేశారు.