40 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి కావాలి
కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఈనెల 16న సాగునీటి సంఘాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని, 40 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్లకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. అమరావతి సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధి కారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఇరిగేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, కాడా కమిషనర్ రామసుందర రెడ్డి, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు నాయుడు వరకు సాగు నీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. గత ఐదేళ్ల పాలనలో సాగు నీటి వ్యవస్థలకు సరైన కేటాయింపులు లేక సాగు నీటి సరఫరా, మురుగు నీటి పారుదల వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, కనీస పర్యవేక్షణ లేకపోవడంతో సిల్ట్, పూడికతీత, తూడు తొలగింపు పనులు చేపట్టక చివరి పొలాలకు సాగు నీరు అందని దుస్థితి నెలకొందన్నారు. అలాగే సాగు నీటి రంగంలో కనీసం జవాబుదారీతనం, పారదర్శకత లోపించాయని, రైతుల భాగస్వామ్యం లేదని, గత ప్రభుత్వం సాగు నీటి సంఘాలను రద్దు చేయడం అంటే రైతులు లేని వ్యవసాయం లాంటిదే అని అన్నారు. మరలా సాగు నీటి వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించాలనే ముఖ్యమంత్రి సంకల్పం మేరకు రాష్ట్రంలోని 6,219 సాగు నీటి సంఘాలకు, 252 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు, 56 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. లోకలైజేషన్ పూర్తయిన కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఉంటే వెంటనే కాడా కమిషనర్కు ప్రతిపాదనలు పంపాలని, కొత్త జిల్లాల ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు. నీటి పారుదల శాఖ ద్వారా విస్తీర్ణాన్ని నిర్ణయించాల్సి ఉందని, పునర్విభజన పూర్తయిన తరువాత రెవెన్యూ శాఖ ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తుందని, సీసీిఆర్సీ కార్డులు ఉన్న కౌలుదారులను కూడా ఓటర్ల జాబితాలో చేర్చాలని సూచించారు.
లేనిపక్షంలో ఒరిజినల్ పట్టాదారు ఓటరుగా నమోదు అవుతారని తెలిపారు. ముందస్తుగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని, అన్ని జిల్లాల్లో ఎటువంటి గొడవలకు తావు లేకుండా సాగు నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తగు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు.