. ఈ నెల 22నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
. ఆగస్టు 12వరకు కొనసాగింపు
న్యూదిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కాగా 2024-25 కేంద్ర బడ్జెట్ను ఈ నెల 23న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శనివారం ‘ఎక్స్’ లో వెల్లడిరచారు. బడ్జెట్ సమావేశాల తేదీలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని వెల్లడిరచారు. 2024-25 సంవత్సరానికి గాను పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఈ నెల 23న ప్రవేశపెడ్తారు. ‘భారత ప్రభుత్వ సిఫారసు మేరకు 2024 జులై 22 నుంచి 2024 ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరిచే ప్రతిపాదనకు గౌరవ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను జులై 23న లోక్ సభలో ప్రవేశపెడతాము’ అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
తాత్కాలిక బడ్జెట్
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలికంగా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సంప్రదాయం ప్రకారం లోక్సభ ఎన్నికలు జరిగే సంవత్సరం ముందు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశ పెడ్తారు. అందులో కీలకమైన విధాన ప్రకటనలు, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు ఉండవు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత గెలిచిన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడ్తుంది. అందులో కీలక ప్రతిపాదనలు, నిర్ణయాలు ఉంటాయి. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో జూన్ 24న 18వ లోక్సభ మొదటి సెషన్ ప్రారంభం కాగా… జూన్ 26న ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు. ఇక తొలి సమావేశాలు ముగియడంతో ఇప్పుడు కేంద్రం బడ్జెట్ సమావేశాలకు కొత్త ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను జులై 23న లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడిరచారు.
నిర్మలమ్మ సరికొత్త రికార్డు
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె.. 2024-25 బడ్జెట్ను సమర్పించనున్నారు. అయితే వరుసగా ఆరుసార్లు బడ్జెట్లను సమర్పించిన మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ని అధిగమించనున్నారు. మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడితే… వరుసగా ఏడు కేంద్ర బడ్జెట్లను సమర్పించిన ఆర్థిక మంత్రిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. కాగా, మోదీ తొలి విడత మంత్రి వర్గంలో (2014) పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో రెండోసారి ప్రధాని మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖను అప్పగించారు నరేంద్రమోదీ. నాటి నుంచి దేశీయ ఆర్థిక రంగంలో మలి విడుత ఆర్థిక సంస్కరణలను పరుగులెత్తించారు. కేంద్ర మంత్రివర్గంలో మూడోసారి వరుసగా చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు.